ఈ ఐపీఎల్ సీజన్లో ఆటతో కంటే తన దూకుడు నైజం, ప్రవర్తనతో వార్తల్లో నిలిచిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే.. అది లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ నవీన్ ఉల్ హకే. మే 1న విరాట్ కోహ్లితో వాగ్వాదం తర్వాత నవీన్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ ద్వారా పరోక్షంగా కోహ్లీని కవ్విస్తూ.. అతడి అభిమానులకు టార్గెట్ అయ్యాడు. తాజాగా ముంబై ఇండియన్స్ ప్లేయర్లతోపాటు అభిమానులకు కూడా అతడు లక్ష్యంగా మారాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నోపై ముంబై గెలిచాక.. ఆ జట్టు క్రికెటర్లు సందీప్ వారియర్, కుమార్ కార్తికేయ, విష్ణు వినోద్.. నవీన్ ఉల్ హక్ను టార్గెట్ చేశారు.
ఐపీఎల్లో ముంబై చేతిలో ఆర్సీబీ ఓడిన సమయంలో మామిడి పండ్లను పోస్టు చేసిన నవీన్ ఉల్ హక్.. స్వీట్ మ్యాంగోస్ అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు కూడా ‘స్వీట్ సీజన్ ఆఫ్ మ్యాంగోస్’ అంటూ నవీన్ను ట్రోల్ చేశారు. చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అన్నట్టుగా ఫోజు ఇచ్చిన ముగ్గురు క్రికెటర్లు మామిడి పండ్లను డైనింగ్ టేబుల్ మీద ఉంచి ఫొటో దిగారు. సందీప్, విష్ణు ఆ ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. సందీప్ వారియర్, విష్ణు వినోద్ స్వీట్ మ్యాంగోస్ ఫొటోలకు లక్నో సభ్యుడైన ఆవేశ్ ఖాన్ లైక్ చేయడం గమనార్హం. కానీ కాసేపటికే ముంబై క్రికెటర్లు ఆ పోస్టును డిలీట్ చేశారు. ఈలోగా చాలా మంది స్క్రీన్ షాట్లు తీసుకున్నారు. ఆ ఫొటోను వైరల్ చేస్తున్నారు.
కోహ్లీని అంటే ముంబై ఇండియన్స్ క్రికెటర్లకు ఎందుకు కోపం వచ్చింది అనుకుంటున్నారా..? ఎలిమినేటర్ మ్యాచ్లో నవీన్ బౌలింగ్లోనే రోహిత్ శర్మ ఔటయ్యాడు. హిట్ మ్యాన్ను ఔట్ చేశాక.. నవీన్ ఉల్ హక్ కేఎల్ రాహుల్ స్టైల్లో చెవులు మూసుకొని సంబరాలు చేసుకున్నాడు. దీంతో అప్పటికే అతడిపై కోపంతో ఉన్న ఆర్సీబీ అభిమానులకు ముంబై ఫ్యాన్స్ తోడయ్యారు. ఇంకేం ఉంది.. కోహ్లీ కోహ్లీ అంటూ.. అతడి చెవులు చిల్లులు పడేలా నినాదాలు చేశారు.
ఇళ్లలో టీవీల ముందు కూర్చున్న అభిమానులు సైతం స్వీట్ మ్యాంగోస్తో ఫొటోలు దిగి.. నవీన్ ఉల్ హక్ను ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన ముంబై తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోగా.. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం లక్నో ఓటమిని సెలబ్రేట్ చేసుకున్నారు.
తాను ఎక్కడికెళ్లినా కోహ్లీ.. కోహ్లీ.. నినాదాలు మార్మోగడం పట్ల నవీన్ స్పందించాడు. దీన్ని తాను ఎంజాయ్ చేశానని చెప్పాడు. గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరూ అతడి పేరు (కోహ్లి) లేదా వేరే క్రికెటర్ల పేరు పలుకుతుండటం తనకు నచ్చిందన్నాడు. తన జట్టు తరఫున బాగా ఆడేందుకు ఇది ప్రేరణనిచ్చిందన్నాడు. బయటి నుంచి వచ్చే శబ్దాలపై తాను శ్రద్ధ పెట్టలేదన్న నవీన్.. తన ఆటపైనే ఫోకస్ పెట్టానని చెప్పాడు. ప్రేక్షకులు కోహ్లీ కోహ్లీ అని అరవడం తనపై ప్రభావం చూపలేదన్నాడు. ఆటలో ఇదంతా భాగమేనన్నాడు.