మహారాష్ట్ర పోలీసులు తమ పట్ల అవమానకరంగా ప్రవర్తించారని ఎంపీ నవనీత్ రాణా ఆరోపించారు. ఈ మేరకు సోమవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. తనతోను, తన భర్త రవి రాణాతోనూ అమర్యాదగా ప్రవర్తించారని, నేరస్థుల కంటే హీనంగా చూశారని ఆమె ఫిర్యాదులో పేర్నొన్నారు.
ప్రస్తుతం నవనీత్ రాణా మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా, ఆమె భర్త రవి అమరావతి జిల్లా బడ్నేరా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. సోమవారం స్పీకర్తో దాదాపు 45 నిమిషాలపాటు సమావేశమైన రాణా దంపతులు.. మహారాష్ట్ర పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఈ భేటీ అనంతరం వారు మీడియాలో మాట్లాడారు. తన ఫిర్యాదును ఈ నెల 23న లోక్సభ హక్కుల కమిటీ పరిశీలిస్తుందని అన్నారు. తాను లిఖితపూర్వక స్టేట్మెంట్ ఇస్తానని తెలిపారు. తమ అరెస్ట్, తదనంతర పరిణామాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కూడా ఫిర్యాదు చేస్తామని రాణా దంపతులు తెలిపారు. మరోవైపు, రాణా దంపతుల అరెస్ట్పై వాస్తవాలు పంపాలంటూ లోక్సభ కార్యాలయం కేంద్ర హోంశాఖ ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని ప్రకటించి కలకలం రేపిన రాణా దంపతులను గత నెల 23న అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇటీవలే వారు బెయిలుపై విడుదలయ్యారు. అయితే కోర్టు వారికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఈ సంఘటనపై మీడియాతో మాట్లాడవద్దని ఓ షరతు విధించింది.
కానీ, వరుసగా మీడియాతో మాట్లాడుతూ బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ, మత ఉద్రిక్తలు కలిగే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ వారి బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. వారి మీడియా సమావేశాల వీడియోలను కూడా కోర్టుకు సమర్పించారు.