ఉల్లిపాయలు కోస్తేనే కాదు..పండించిన కూడా కంట నీరు తెప్పిస్తోంది. ఎందుకంటే రోజురోజుకి ఉల్లిపాయల ధరలు పతనమవుతున్నాయి. మొన్నటికి మొన్న ఓ రైతు 512 కేజీల ఉల్లిపాయలు అమ్మితే అతనికి చేతికి వచ్చిన మొత్తం రూ.2.49 పైసలు. ఈ ఒక్క సంఘటన చాలు ఉల్లి రైతులు ఎలాంటి దారుణ పరిస్థితుల్లో ఉన్నారు అనేది తెలుసుకోవడానికి.
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉల్లిపాయలతో విధాన సభకు వచ్చారు. అధికారులు తలపై ఉల్లిపాయల బుట్టలను పెట్టుకుని రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద కొందరు ఎమ్మెల్యేలు మెడలో ఉల్లి, వెల్లుల్లిపాయల దండలు వేసుకొని కనిపించారు.
మరికొందరు ఉల్లిపాయల దండలు వేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఉల్లి రైతుల సమస్యలపై తీవ్ర ఆందోళన నెలకొంది. దీంతో ఉల్లి, వెల్లుల్లికి తగిన ధరలు నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యేలు ఉల్లిపాయలతో నిరసన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పంటలకు సరైన మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం ప్రచారంలో బిజీగా ఉందని, ఉల్లి రైతులు మాత్రం విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.