ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ట్విట్టర్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి మోడీ వరకు ఎవరైనా సరే ఎక్కడైనా ఎమన్నా తప్పుగా నోరు జారి మాట్లాడి దొరికిపోతే ఇంకా ట్విట్టర్ లో వాళ్ళ పరిస్థితి అంతే. ఇతర సామాజిక మాధ్యమాల కంటే ట్విట్టర్ వినియోగదారుల్లో అత్యధికులు విద్యావంతులు, వృత్తి నిపుణులు ఉన్నారు. మన నాయకులు ఎక్కడ టంగ్ స్లిప్ అయినా ఒక రేంజ్ లో నెటిజన్లు ఆడేసుకుంటారు. వారి తెలివి తక్కువతనాన్ని బట్టబయలు చేయటమే కాదు బట్టలు చిరిగేదాకా ఉతుకుతారు. ఆ ఉతుకుడు బారిన పడిన వాళ్లలో మన ప్రధాని మోడీ నుంచి యువ నేత రాహుల్ గాంధీ వరకూ ఉన్నారు.
ఇప్పుడు వారి సరసన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బ్లీచింగ్ పౌడర్ చల్లితే పోతుందని, పారాసిటమల్ వేసుకుంటే సరిపోతుందని ఆయన చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గత 24 గంటల నుంచి నెటిజన్లు జగన్ ను ఏకిపారేస్తున్నారు. ఎంతలా అంటే.. జగన్ ను ఓ ఆట ఆడుకుంటున్నారు అనటానికి ఉదాహరణ ఏంటంటే ట్విట్టర్లో దేశవ్యాప్తంగా నెంబర్ వన్ ట్రిండింగ్ అయిన పదం #BleachingPowder. పిడికెడు బ్లీచింగ్ పౌడర్ లేకనే అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాలు అల్లాడుతున్నాయా.. అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కరోనా మందు కనుగొన్న ఆంధ్రా సీఎంకి వైద్యరంగంలో నోబుల్ ఇవ్వాల్సిందేనని వెటకారంగా ఏకిపడేస్తున్నారు. కేవలం ఏపీ నుంచి కాదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి విమర్శలు రావటంతో ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్లోకి ఏపీ సీఎం కామెంట్ బ్లీచింగ్ పౌడర్ చేరింది.
జగన్ ప్రమాణ స్వీకారం చేసి 10 నెలలు అయింది. ఇప్పటిదాకా ఇసుక కొరత, మూడు రాజధానులు, అమరావతి తరలింపు వంటి కీలక సమస్యలు ఉన్నా మీడియా సమావేశం పెట్టని సీఎం తొలిసారి కరోనాపై పెట్టిన ప్రెస్మీట్లో ఇలా బుక్కయిపోవటంతో ఇంకోసారి ప్రెస్మీట్ పెట్టకపోవచ్చని కొందరు జాతీయ మీడియా ప్రతినిధులు కామెంట్ చేయటం విశేషం.