సీఎం కేసీఆర్ ఎప్పుడో గానీ జిల్లాలకు రారు. హైదరాబాద్ లో ఉన్నా ప్రగతి భవన్, ఫాంహౌస్ దాటరనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన జిల్లా పర్యటన పెట్టుకున్నప్పుడల్లా ప్రతిపక్ష నేతలు ఏదో ఒక అంశంపై కాన్వాయ్ ను అడ్డుకోవడం కామన్ అయిపోయింది. తాజాగా మహబూబాబాద్ జిల్లా పర్యటనలోనూ సీఎంకు నిరసన సెగ తాకింది.
కేసీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా న్యూ డెమోక్రసీ నేతలు నిరసన తెలిపారు. సీఎం కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. దీంతో న్యూ డెమోక్రసీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పట్టణంలో ఇండ్ల స్థలం లేనివారు, ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న వారికి వెంటనే స్థలాల హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు న్యూ డెమోక్రసీ నేతలు. అలాగే వారికి విద్యుత్, నల్లాలు, రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆందోళన చేశారు. జిల్లాలో వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్దికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలా చేసినప్పుడే కొత్త జిల్లాల అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా ప్రతిపక్ష నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఎక్కడా నిరసనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. కానీ, న్యూ డెమోక్రసీ నేతలు పోలీసుల కన్నుగప్పి సీఎం కాన్వాయ్ ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.