ఐపీఎల్ 15వ సీజన్ కోసం కొత్త ఫార్మాట్ ను అమలు చేయనున్నారు బీసీసీఐ అధికారులు. ఈ సీజన్ లో జట్ల సంఖ్య 8 నుంచి 10 కి పెరగడంతో మ్యాచ్ ల సంఖ్యను తగ్గించేందుకు జట్లను రెండు గ్రూపులుగా విభజించినట్టు బీసీసీఐ వెల్లడించింది. కానీ.. ఎప్పటిలాగే గ్రూప్ దశలో ఒక్కో జట్టు 14 మ్యాచ్ లు ఆడనుందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో కొత్త ఫార్మాట్ వివరాలను బీసీసీఐ ప్రకటించింది. ఎక్కువ ట్రోఫీలు గెలిచిన జట్ల ఆధారంగా నంబర్లు కేటాయించినట్టు ప్రకటించారు నిర్వాహకులు. ఒక జట్టు అదే గ్రూప్ లోని మిగతా జట్లతో రెండేసి మ్యాచ్ లు ఆడుతోందన్నారు. మరో గ్రూప్ లోని జట్లతో ఒక మ్యాచ్ ఆడనుందని స్పష్టం చేశారు.
అలాగే.. టేబుల్ లో పక్కన ఉన్న టీంతో మరో మ్యాచ్.. అంటే (1+1) ఆడుతోందని తెలిపారు. ఈ లెక్కన ఒక్కో జట్టు 14 మ్యాచ్ లు ఆడనున్నట్టు వెల్లడించారు. మార్చి 26 న ఐపీఎల్ ప్రారంభం కానుండగా.. లీగ్ దశలో 70 మ్యాచ్ లు జరుగుతాయన్నారు. ఆ తర్వాత నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్ లు ఉంటాయని తెలిపారు.
గ్రూప్-ఎ లో.. ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో టీంలు ఉన్నాయి. గ్రూప్-బి లో.. చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఉన్నాయి. వీటిని ఎక్కువ ట్రోఫీలు గెలుచుకున్న టీంల వివరాల ఆధారంగా ఎంపిక చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.
ఈ జట్లు ఏ ఫార్మట్ లో ఆడుతాయనే దానిపై క్లారిటీ ఇచ్చారు బీసీసీఐ అధికారులు. ఉదాహరణకు ముంబై ఇండియన్స్ జట్టు గ్రూప్-ఎ లో ఉన్నందున.. అదే గ్రూప్ లోని మిగిలిన నాలుగు టీమ్ లతో రెండేసి మ్యాచ్ లు ఆడుతోంది. అలాగే గ్రూప్-బి లోని హైదరాబాద్, బెంగళూరు, పంజాబ్, గుజరాత్ జట్లతో ఒక్కో మ్యాచ్ తో పాటు.. పక్కనే ఉన్న చెన్నైతో రెండు మ్యాచ్ లు ఆడుతోందని స్పష్టం చేశారు.