తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఫిక్స్ అయింది. వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు ఫిబ్రవరి 17వ తేదీ, శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభోత్సవం జరగనున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నూతన సచివాలయ ప్రారంభోత్సవం రోజే.. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు కూడా ఉంది. రూ.617 కోట్లతో సచివాలయ భవనాన్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పద్ధతిలో నిర్మించారు. భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా ప్లాన్ చేశారు.
ప్రారంభోత్సవానికి ముందు ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీ యాగం, సుదర్శన యాగం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా నూతన సచివాలయం ప్రారంభం జరగనుంది. ఈ వేడుకకు జాతీయ నేతలను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వినీ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జేడీయు జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, డా. బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తదితర ముఖ్యులు పాల్గొంటారు.
ఇప్పటికే ఈ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత.. మధ్యాహ్నం, సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో సచివాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్య అతిథులందరూ పాల్గొంటారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.