సాధారణంగా కొత్తగా పెళ్లి చేసుకునే జంటలకు బంగారమో, ఏదైనా ఇంటికి పనికొచ్చే వస్తువులను గిఫ్ట్లుగా ఇస్తారు. కానీ, యూపీలో ఆ ట్రెండ్ మారింది. అక్కడ కొత్తగా పెళ్లి చేసుకునే వారికి బుల్డోజర్ బొమ్మలను గిఫ్టులుగా ఇస్తున్నారు. అందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల్లో బుల్డోజర్లపై చేసిన వ్యాఖ్యాలే కారణం. దీంతో రాష్ట్రంలో బుల్డోజర్లకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. చివరికి పెళ్లి చేసుకున్న జంటలకు కూడా బుల్డోజర్ బొమ్మలను గిఫ్ట్లుగా ఇచ్చేంతగా పాపులర్ అయ్యాయి.
యూపీలోని ప్రయాగ్రాజ్లో చౌరాసియా సమాజ్ ఆధ్వర్యంలో ఓ సామూహిక వివాహ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో తొమ్మిది జంటలు పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా చౌరాసియా సమాజ్ ప్రతినిధులు ఆ జంటలకు బుల్డోజర్లను బొమ్మలను బహుమతిగా అందజేశారు. దీనిని చూసి పెళ్లిళ్లకు హాజరైన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.
ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్ మేయర్ అభిలాషా గుప్తా నంది మాట్లాడుతూ.. రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ పాలన నచ్చి బుల్డోజర్ బొమ్మలను గిఫ్ట్లుగా ఇచ్చినట్టు వారు చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు మంచి భద్రత, రక్షణ ఉన్నాయన్నారు. బుల్డోజర్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రతీక అని, తప్పు చేసిన వారందరిని ముఖ్యమంత్రి శిక్షిస్తారని కూడా అన్నారు.
కాగా కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల ప్రచారంలో బాబా బుల్డోజర్గా యోగిపై ప్రచారం జరిగింది. నేరాలకు పాల్పడే వారిపై, మాఫియాపై యోగి ప్రభుత్వం బుల్డోజర్లు ఎక్కిస్తుందని బీజేపీ ప్రచారం చేసింది. యూపీలో జరిగిన ఎన్నికల్లో యోగి అత్యధిక మెజార్టీతో గెలుపొంది మళ్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో కొత్తగా పెళ్లయిన జంటలకు ఇలాంటి వినూత్న బహుమతులు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2018లో ప్రయాగ్ రాజ్లో నిర్వహించిన సామూహిక వివాహాల్లో పెళ్లి చేసుకున్న జంటలకు టాయిలెట్ సీట్లను బహుమతిగా అందజేశారు. ప్రధానమంత్రి స్వచ్ఛభారత్ కార్యక్రమం తమను బాగా ప్రభావితం చేసిందని, దాన్ని మరింత విస్తృతం చేయడంలో తమ వంతు కృషి ఉండాలనే టాయిలెట్ సీట్లను బహుమతిగా ఇచ్చినట్లు అప్పటి సామూహిక వివాహ నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే కాలుష్యాన్ని నియంత్రించేందుకు కొత్త దంపతులకు ఇంటి ముందు నాటడానికి మొక్కలను కూడా ఇచ్చారు.