కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు వణికిపోయాయి. ఇప్పటికే మూడు వేరియంట్ల రూపంలో విజృంభించిన కరోనా.. కాస్త ఊరటనిచ్చినట్టే ఇచ్చి.. మరో కొత్త వేరియంట్ రూపంలో ప్రబలుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా థర్డ్ వేరియంట్ ఒమిక్రాన్ .. సబ్ వేరియంట్ ఎక్స్ఈ హైబ్రీడ్ వేగంగా వ్యాపిస్తున్నట్టు నిపుణులు చెప్తున్నారు. అయితే.. దీంతో ఎలాంటి ముప్పు ఏర్పడుతుందో అనే భయంతో ప్రజలు వణికిపోతున్న నేపథ్యంలో.. ఆస్ట్రియా పరిశోధకులు ఓ శుభవార్త చెప్పారు. అన్ని రకాల వేరియంట్లను అరికట్టేందుకు కొత్త టీకాను అభివృద్ధి చేశామని చెప్తున్నారు.
కొత్త వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు తమ అధ్యయనంలో తేలిందని పరిశోధకులు తెలిపారు. ఈ టీకా ద్వారా ఎలాంటి రోగనిరోధక శక్తి లేని వ్యక్తుల్లో కూడా వైరస్ ను ఎదుర్కొనే సామర్థ్యం వస్తుందని అధ్యయనంలో పేర్కొన్నారు. ఈ టీకాను వియన్నా మెడికల్ యూనివర్సిటీలో అభివృద్ధి చేసినట్టు వెల్లడించారు పరిశోధకులు. ఇది యాంటిజెన్ ఆధారిత వ్యాక్సిన్ అని.. దీనిని ఇప్పటికే మానవులు, జంతు నమూనాల్లో పరీక్షలు జరిపామని అంటున్నారు. ఆ ఫలితాలు సానుకూలంగా వచ్చాయంటున్నారు. కాగా.. ఈ టీకా వైరస్ రిసెప్టర్ బైండింగ్ డొమైన్ లను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుందని తేల్చి చెప్పారు.
కరోనాకు సంబంధించిన పాత, కొత్త వేరియంట్ల స్టెరిలైజింగ్ రోగనిరోధక శక్తిని ప్రేరేపించే సామర్థ్యం కొత్త PreS-RBD వ్యాక్సిన్ కలిగి ఉందని ఈ అధ్యయానికి నేతృత్వం వహించిన రుడాల్ఫ్ వాలెంటా తెలిపారు. ఈ టీకా వైరస్ ప్రవేశించడాన్ని.. రెప్లికేషన్ ను నిరోధిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తద్వారా సంక్రమణను అరికట్టవచ్చని ఆయన వివరించారు.
Advertisements
ప్రస్తుతం ఉన్న టీకాల్లోకెల్లా ఇది మెరుగైనదిగా కనిపిస్తుందని అంటున్నారు. అన్ని వయస్సులు వారు దీనిని తీసుకోవచ్చని పరిశోధకులు స్పష్టం చేశారు. అంతేకాదు తగినంత నిధులు అందుబాటులో ఉంటే ఈ కొత్త టీకా తొలిదశ క్లినికల్ ట్రయల్స్ కు ఈ సంవత్సరంలోనే ఆమోదం లభించవచ్చని తెలిపారు. కాగా.. ఈ కొత్త వేరియంట్ రూపం మార్చుకుని దశలవారీగా దాడి చేస్తూ.. ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్యనిపుణులు చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య శాఖ అధికారులు.