ముంబైలోని గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం సహచరులతో పాటు.. హవాలా ఆపరేటర్లపై ఎన్ఐఏ టీం దాడులు జరుపుతోంది. ముంబైలోని 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది. దావూద్ అనుచరులు, హవాలా వ్యాపారులే టార్గెట్ గా 40 చోట్లకు పైగా ఈ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
నాగ్ పగడా, పరేల్, బోరివలి, శాంతాక్రజ్, ముంద్రా, భెండీ బజార్ వంటి ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు ఎన్ఐఏ అధికారులు. ఫిబ్రవరిలో దీనిపై పలు కేసులు కూడా నమోదు చేసినట్టు వెల్లడించారు. యూఏపీఏ కేసుకి సంబంధించి దావూద్ అసోసియేట్స్ పై ఆరోపణలున్నట్టు ఎన్ఐఏ పేర్కొంది.
దీనిపై ఎన్ఐఏ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందని వెల్లడించారు అధికారులు. డ్రగ్ సప్లయ్ దారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై నిఘా పెట్టినట్టు తెలిపారు. ఆయా సంస్థల కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు. డీ కంపెనీకి చెందిన వివిధ కార్యకలాపాలపై ప్రధానంగా దాడులు కొనసాగుతున్నట్టు వెల్లడించారు.
రాబోయే రోజుల్లో దేశంలో అలజడి కలిగించేందుకు దావూద్ అనుచరులు స్కెచ్ వేశారనే సమాచారంతో దాడులు జరుగుతున్నామని పేర్కొన్నారు. విదేశాల్లో ఉంటూ ఇక్కడ కార్యకలాపాలు సాగించేవారిపై నిఘా కొనసాగుతోందని స్పష్టం చేశారు. దాడుల్లో లభించే సమాచారం బట్టి తదుపరి చర్యలు ఉంటాయని ఎన్ఐఏ అధికారులు తేల్చిచెప్పారు.