వివాదాస్పద గురువు నిత్యానంద స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఆయన రాసలీలల వీడియోలు తెగ వైరల్ అవ్వడంతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతేకాదు, డ్రగ్స్ వాడినట్టు ఆరోపణలు, అత్యాచార ఆరోపణలు, ఆశ్రమంలో ఏనుగు దంతాలు, పులి చర్మాలు ఇలా రకరకాల కేసుల్లో కటకటాల్లోకి కూడా వెళ్లాడు. అయితే, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత దేశం విడిచి పారిపోయిన నిత్యానంద విదేశాల్లోనే కన్నుమూశాడనే వార్తలు కొద్దిరోజులుగా జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.
అయితే, దీనిపై తాజాగా నిత్యానంద స్వామి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు నిత్యానంద. ‘నేను చనిపోలేదు. ప్రస్తుతం సమాధిలో(సుప్తావస్థ) ఉన్నాను. నేను మరణించినట్లు కొందరు వదంతులు వ్యాప్తిచేస్తున్నారు. నేను సమాధిలోకి వెళ్లాను. ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నాను. అందుకు కాస్త సమయం పడుతుంది. మనుషులు, పేర్లు, ప్రాంతాలను గుర్తుపట్టలేకపోతున్నా. 27 మంది వైద్యులు నాకు చికిత్స చేస్తున్నారు.’ అని పేర్కొన్నారు.
ఇక భారత్లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్వామీజీ 50 సార్లు కోర్టుకు హాజరై.. 2019 నవంబర్లో భారత్ వదిలి పారిపోయారు. ఈక్వెడార్లో తన కైలాసం అంటూ సొంత రాజ్యాన్ని స్థాపించాడు. కైలాసను పత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన కూడా చేసుకున్నాడు నిత్యానంద స్వామి. కొద్దిరోజులకు కైలాస డాలర్ను తీసుకొచ్చాడు. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను కూడా ప్రారంభించినట్లు ప్రకటించాడు.
అయితే, ఆయన ఎక్కడ ఉంటున్నారనే విషయం మాత్రం తెలియదు. ఈక్వెడార్కు సమీపంలోని ఓ ద్వీపంలో ఆయన నివాసం ఉంటున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈక్వెడార్ మాత్రం ఈ వార్తలను ఖండిస్తోంది. అయితే, ‘కైలాస’ అధికారిక వెబ్సైట్.. రోజూ నిత్యానందకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంటుంది. ఫేస్బుక్లో ఫోటోలు, వీడియోలను అప్డేట్ చేస్తుంటుంది. తాజాగా ఆయన ఫోటోలు సహా, ఆయన పేపర్పై రాస్తున్నట్లు ఉన్న చిత్రాలను షేర్ చేసింది.