జగిత్యాల జిల్లాలోని లింగం పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల.. ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా ఉంటుంది. ఇక్కడ స్కూల్ లో ఇంగ్లీషు మీడియంలోనే పాఠాలు చెబుతారు. 12 ఏళ్లుగా పది ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తోంది. అయితే ప్రభుత్వం అండగా నిలవకపోవడంతో సమస్యలు తప్పడం లేదు. పాఠశాలలో కేవలం రెండు గదులు మాత్రమే ఉన్నాయి.
అందులో ఒకటి కంప్యూటర్ ల్యాబ్ కు కేటాయించారు. ఇక ఇంకో గదితోనే విద్యార్థులు కాలం వెళ్లదీయాల్సి వస్తుంది. కొందరు విద్యార్థులు మెట్ల కింద, మరికొందరు చెట్ల కిందే పాఠాలు వింటున్నారు.
ప్రహరీ గోడ లేకపోవటంతో పక్కనే రహదారి నుంచి ఏ వాహనం ఎప్పుడు దూసుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం కింద గదులు చేపట్టి ప్రహరీ గోడ నిర్మిస్తే.. మరికొంత మంది విద్యార్థులు స్కూల్ లో చేరే అవకాశముందని అన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
అయితే ఈ పాఠశాలకు దాతలు తమ వంతుగా సహకారం అందిస్తున్నారు. ప్రిన్సిపాల్ తిరుమల్ వద్ద చదివిన ఓల్డ్ స్టూడెంట్స్, స్థానికులు విరాళాలు అందిస్తున్నారు. 70 సైకిళ్ళతో పాటు కంప్యూటర్ ల్యాబ్, డెస్క్ లు, కుర్చీలు వంటి వాటిని దాతలు అందిస్తున్నారు.