మోడీ సర్కార్పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ వచ్చాక దేశంలో వాక్ స్వాతంత్ర్యం లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆయన ప్రసంగంలోని కొంత భాగాన్ని కట్ చేయడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
జార్ఖండ్లోని సాహెబ్గంజ్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. దేశంలో పార్లమెంట్ లోపలగానీ, బయటగానీ వాక్ స్వాతంత్య్రం లేకుండా పోయిందని ఆయన ఫైర్ అయ్యారు. ఒక వేళ ఎవరైనా ధైర్యం చేసి మాట్లాడితే వారిని జైలుకు పంపుతున్నారని ఆయన ఆరోపించారు.
దేశంలో ద్రవ్యోల్బణాన్ని అరికడతామని చెప్పి 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ అప్పటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలతోపాటు, పేదరికం పెరుగుతూనే వస్తోందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్టీ, దేశంలో మౌలిక సౌకర్యాలను అభివృద్ది చేసింది కాంగ్రెస్ అని అన్నారు.
సాహెబ్గంజ్ జిల్లాలోని పాకూర్ పట్టణంలోని గుమానీ గ్రౌండ్లో 60 రోజులపాటు కొనసాగే హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల గురించి ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆయన
సూచించారు.