రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రేపు పదవీ విరమణ చేయబోతున్నందున.. ఆయన గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోదీ.. నిన్న రాత్రి ఢిల్లీలో విందు ఇచ్చారు. కోవింద్ దంపతులు, కాబోయే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. అయితే, ఇందులో కొంత మంది సీఎంలకు ఆహ్వానం అందలేదు. ఆహ్వానం అందని లిస్ట్ లో సీఎం కేసీఆర్ కూడా ఉన్నారు.
కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ చౌధరి విందుకు వెళ్లారు. పద్మ అవార్డు గ్రహీతలను కూడా ఆహ్వానించగా, తెలంగాణ నుంచి పద్మశ్రీ మొగిలయ్య హాజరయ్యారు. సీఎంలకు నేరుగా ఆహ్వాన కార్డులు పంపడానికి సమయం లేకపోవడం వల్ల.. ఢిల్లీలోని ఆ రాష్ట్రభవన్ల రెసిడెంట్ కమిషనర్లకు వాటిని అందిస్తున్నామని అంతకుముందు ప్రధాని కార్యాలయం తెలిపింది. వారు హోంశాఖ కార్యాలయం నుంచి కార్డులను తీసుకొని తమ సీఎంలు, డిప్యూటీ సీఎంలకు పంపాలని సూచించింది.
బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులతో పాటు.. ఎన్డీఏకు బయటి నుంచి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చిన ఆంధ్రప్రదేశ్, ఒడిశా సీఎంలనూ ప్రధాని కార్యాలయం ఆహ్వానితుల జాబితాలో చేర్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్తోపాటు కేరళ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, పంజాబ్, దిల్లీ, బంగాల్, మిజోరం, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులెవరినీ పిలవలేదు.
యూపీఏ కూటమిలో కొనసాగుతూ, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికిన తమిళనాడు సీఎం స్టాలిన్ను మాత్రం ఆహ్వానించడం విశేషం. విందుకు భాజపా సీఎంలు మినహా ఒడిశా, ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రులెవరూ హాజరుకాలేదు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ బలపర్చిన ద్రౌపది ముర్ము విపక్షాల అభ్యర్థి యశ్వంత్సిన్హాపై 2,96,626 విలువైన ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ చేసిన ప్రకటన ప్రకారం ఆమెకు 6,76,803 విలువైన ఓట్లు రాగా, యశ్వంత్ సిన్హాకు 3,80,177 విలువైన ఓట్లు దక్కాయి.