గత కొద్ది రోజులుగా ఐరోపా వాసులను భానుడు భయపెడుతున్నాడు. భానుడి వేడికి అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం భూమి ఉత్తర భాగంలోని యూరప్లో ఎండాకాలంలో భారీ ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో యూరప్ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఎండ వేడికి రోడ్లపై తారు కరిగి వాహనాల టైర్లకు అంటుకుపోతోంది.
ఇళ్లలోంచి బయటికి రావడానికి జనం జంకుతున్నారు. ఈ వేడి పరిస్థితి లండన్లోని ప్రఖ్యాత హ్యామర్ స్మిత్ బ్రిడ్జికీ తగిలింది. ఎప్పుడో 135 ఏళ్ల కిందట కట్టిన హ్యామర్ స్మిత్ బ్రిడ్జి లండన్ లోని పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. బలమైన ఉక్కు తాళ్ల సపోర్టుతో నిర్మించిన ఈ బ్రిడ్జి ఇప్పటివరకు చెక్కు చెదరలేదు.
కానీ ఇటీవలి కాలంలో మండుతున్న ఎండలు, ఉష్ణోగ్రతలు ఈ బ్రిడ్జిని భయపెడుతున్నాయి. బ్రిడ్జికి ఆధారంగా ఉన్న ఉక్కు తాళ్లు విపరీతంగా వేడెక్కి సన్నగా పగుళ్లు వస్తున్నట్టు గుర్తించారు. దీనితో అప్రమత్తమైన అధికారులు.. బ్రిడ్జికి ఉన్న ఉక్కు తాళ్లు, ఉక్కు ఆధారాలకు ఇలా టిన్ ఫాయిల్ (సన్నని తగరపు రేకు)ను పట్టీలా కట్టి పెట్టారు.
Advertisements
దీనివల్ల ఉక్కు తాళ్లపై పడే ఎండ పరావర్తనం చెందుతుందని.. అవి విపరీతంగా వేడెక్కిపోకుండా ఉంటుందని లండన్ అధికారులు చెబుతున్నారు.రెండేళ్ల కిందట కూడా విపరీతమైన ఉష్ణోగ్రతలతో ఉక్కు తాళ్లు వేడెక్కి.. అతి సన్నని పగుళ్లు కనిపించాయని, అందుకే ఈసారి మరింత జాగ్రత్త చర్యలు చేపట్టామని అంటున్నారు.