టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దర్శనమే మహా భాగ్యమని భావించే గులాభీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. జాతీయ పార్టీ ప్రకటించే వేళ టీఆర్ఎస్ నేతలను బయటకు తోసేసారు పోలీసులు. దీంతో చివరకు నిరాశతో వెనుదిరిగారు. పార్టీ తరపున నామినేటెడ్ ఫోస్టులు ఇచ్చినా కూడా కీలక సమయాల్లో వారికి ఎంట్రీ దొరకడం లేదు. మరోవైపు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చి నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్లడాన్ని పార్టీ శ్రేణులు గొప్పగా చెప్పుకుంటున్నాయి. ఆ ప్రకటన కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.
ఎన్నో ఆశలతో తెలంగాణ భవన్ కు వచ్చి కేసీఆర్ వెంట వచ్చే బీఆర్ఎస్ పదాలను వినాలనుకున్న వారికి నిరాశే మిగిలింది. సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలకు కూడా వెళ్లనీయకుండా గేటు బయటే ఆపేశారు. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డిని గేటు దగ్గరే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
నామినేటెడ్ పోస్టులతో రెండు వేర్వేరు కార్పొరేషన్, సంస్థలకు చైర్మన్ లుగా ఉన్నామని చెప్పుకున్నా వారికి లోపలికి ఎంట్రీ లభించలేదు. కేసీఆర్ ప్రకటనలు వచ్చినప్పుడల్లా చిత్ర పటాలకు పాలాభిషేకాలు నిర్వహించే వీరికి పార్టీ చరిత్రనే మలుపుతిప్పే ఈ కార్యక్రమానికి మాత్రం అవకాశం దక్కలేదు. గేటు దగ్గర ఉన్న వీరిని బయటకు తోసివేశారు పోలీసులు.
కాగా దసరా పండుగ శుభదినాన తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా మారింది. ఈ మేరకు కేసీఆర్ అధికారిక ప్రకటన చేశారు. టీఆర్ఎస్ పేరును మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు ఈ తీర్మానంపై సంతకం చేశారు. 8 రాష్ట్రాలకు చెందిన నేతలు టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు.