తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సర్వదర్శనం టోకెన్లు తీసుకోవాలనుకునే వారికి ఇది చేదు వార్తే. జనవరి 3వరకు తిరుపతి మినహా మిగిలిన ప్రాంతాల వారికి ఇబ్బందులు తప్పేలా లేవు. ఆదివారం రాత్రి ఈనెల 24వరకు ఇవ్వాల్సిన సర్వదర్శన టోకెన్లు ఇచ్చేశారు. 25వ తేదీ నుండి సర్వదర్శన టోకెన్లు అన్నీ తిరుపతి స్థానికులకే ఇస్తామని ఇప్పటికే టీటీడీ ప్రకటించేసింది. దీంతో జనవరి 3వరకు ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారికి ఇబ్బందులు తప్పేలా లేవు.
వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారం తెరిచి ఉంచాలని తిరుమల తిరుపతి అధికారులు నిర్ణయించారు. భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చని భావించారు. ఇదే సమయంలో తితిదే ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ప్రత్యేక దర్శన టోకెన్లను ఆన్లైన్లో విడుదల చేసింది. నిత్యం శ్రీవారి ఆన్లైన్ వెబ్సైట్ చూసే భక్తులు వెంటనే టికెట్లు నమోదు చేసుకున్నారు. మిగిలిన వారికి దొరకని పరిస్థితి. సర్వదర్శనం టోకెన్లు తీసుకుని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చని కొందరు భావిస్తే… తితిదే అధికారులు రెండు రోజుల క్రితమే సర్వదర్శన టోకెన్లను స్థానికులకే పరిమితం చేసినట్లు చెప్పారు.
దీనిపై భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ అధికారులు పెద్దగా స్పందించటం లేదు. అయితే, భక్తుల రద్దీ వల్లే అలా చేయాల్సి వచ్చిందని కొందరు అధికారులు కామెంట్ చేస్తున్నారు.