ఉత్తర కొరియా మరో సంచలనానికి తెర తీసింది. ఉన్నట్టుండి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి అందరినీ ఆందోళనకు గురి చేసింది. ఇది “అమెరికాకు వార్నింగ్” అంటూ ప్రకటించింది. ఎదురు దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చూపించేందుకే ఈ సర్ప్రైజ్ ఇచ్చామని చెప్పింది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాల మేరకు అప్పటికప్పుడు ఈ డ్రిల్ నిర్వహించారు.
ఇదే విషయాన్ని సౌత్ కొరియా ధ్రువీకరించింది. ఉత్తర కొరియాకు చెందిన మిజైల్ గగనతలంలో దాదాపు 66 నిముషాల పాటు చక్కర్లు కొట్టినట్టు జపాన్ కూడా వెల్లడించింది. అమెరికాను టార్గెట్ చేసుకునే ఈ ప్రయోగం చేసినట్టు వివరించింది. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన నార్త్ కొరియా…ఇది తమ దేశ యుద్ధ సామర్థ్యానికి నిదర్శనం అని తేల్చి చెప్పింది. ఎదురు దాడికి దిగాల్సిన అవసరం వస్తే అందుకు సిద్ధమేనని హెచ్చరించింది.
సియోల్, వాషింగ్టన్ ఇటీవలే ఓ కీలక సమావేశం నిర్వహించాయి. నార్త్ కొరియా న్యూక్లియర్ అటాక్ చేస్తే ఎలా ఎదుర్కోవాలని చర్చించుకున్నాయి. దీనికి కౌంటర్గా ఇప్పుడు నార్త్ కొరియా బాలిస్టిక్ మిజైల్స్ని టెస్ట్ చేసింది. నిజానికి నార్త్ కొరియా ఇప్పటికే అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. సౌత్ కొరియాతో కలిసి మిలిటరీ డ్రిల్స్ నిర్వహించాలనుకోవడాన్ని ఖండించింది. యుద్ధానికి సిద్ధమేనన్న సంకేతాలిస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే సౌత్ కొరియా, నార్త్ కొరియా మధ్య వైరం, దూరం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో అమెరికా సౌత్ కొరియాకు దగ్గరవడం నార్త్ కొరియాను ఇబ్బంది పెడుతోంది.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ జోరు పెంచారు. ఇప్పటివరకు అప్పుడప్పుడూ క్షిపణి ప్రయోగాలు చేసే ఉత్తర కొరియా.. గతేడాది నవంబర్లో ఒకేసారి 10 బాలిస్టిక్ మిసైల్స్ను ప్రయోగించింది. వీటిల్లో కొన్ని దక్షిణ కొరియా సముద్ర జలాల్లో పడ్డాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.