తెలుగు సినీ పరిశ్రమలో ఒక హీరో సినిమాకి మరో హీరో వాయిస్ ఇవ్వడం వంటివి ఎప్పటి నుంచో జరుగుతుంది. జల్సా చిత్రానికి మహేష్ బాబు, మర్యాదరామన్న చిత్రానికి రవితేజ వంటి అగ్ర హీరోలు తమ గొంతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
సాయి ధరమ్ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ను డిసెంబర్ 7వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ గ్లింప్స్కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ డైలాగ్ డెలివరీ ఉన్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ గ్లింప్స్పై అంచనాలు పెరిగాయి. సాయిధరమ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ల మధ్య కూడా మంచి స్నేహం ఉంది. తను సినిమాల్లోకి రాక ముందు నుంచే తారక్ తనకు మంచి ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
మెగా హీరోల్లో రామ్ చరణ్, అల్లు అర్జున్లతో కూడా జూనియర్ ఎన్టీఆర్ చాలా క్లోజ్గా ఉంటారు. ఇక సాయి ధరమ్ తేజ్ 15వ సినిమా మిస్టిక్ థ్రిల్లర్గా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సుకుమార్ కథ అందించడం విశేషం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో అజయ్, బ్రహ్మాజీ, సునీల్ తదితరులు నటిస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ చిత్రం ‘కాంతార’ కు సంగీతం అందించిన అజనీష్ లోక్నాథ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.
ఈ సినిమాకి ‘రుద్రవనం’ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కథ ప్రకారం సినిమాలో రుద్రవనం అనే ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఊహించని విధంగా హత్యలు, ఆత్మహత్యలు జరుగుతుంటాయి. వాటిని హీరో ఎలా ఛేదించాడనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిజానికి ఇలాంటి కాన్సెప్ట్ తో ఇదివరకు చాలా సినిమాలొచ్చాయి. కాకపోతే సాయిధరమ్ తేజ్ తొలిసారి ఇలాంటి జోనర్ లో నటిస్తున్నారు.