కాలే కడుపులు కాలుతూనే ఉన్నాయి. కాలం చెల్లితే కట్టెకాల్చడానికి కూడా డబ్బుల్లేని నిరుపేద జీవితాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో హృదయాన్ని కలచివేసే సంఘటన అలాంటిదే.
ఆసుపత్రిలో అప్పటిదాకా ప్రాణాలతో పోరాడి తుది శ్వాస విడిచిన తన భార్యను స్వగ్రామానికి తీసుకెళ్ళడానికి సరిపడా డబ్బుల్లేక…మృతురాలిని భుజాన మోసుకుని పోతూ కనిపించాడు ఓ నిర్భాగ్యుడు.
ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ సొరడ గ్రామానికి చెందిన ఈడేగురు అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతుంటే ఆమె భర్త సాములు.. విశాఖ జిల్లాలోని అనిల్ నీరుకొండ మెడికల్ కళాశాల ఆసుపత్రికి తీసుకొచ్చారు.
వారం రోజుల చికిత్స అనంతరం ప్రయోజనం లేదు ఇంటికి తీసుకెళ్లమనడంతో భార్యను తీసుకొని ఆటోలో విజయనగరం బయలుదేరారు. మార్గ మధ్యలోనే ఆమె మృతి చెందడంతో.. ఆటో డ్రైవరు చెల్లూరు రింగు రోడ్డులో దించేసి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో సాములు.. భార్య మృతదేహాన్ని భుజం మీద వేసుకొని కాలి నడకన స్వస్థలం బయలు దేరారు.
బాధను చెప్పునే భాష రాక,తన ఊరికిపోయే దారిలేక భార్య మృతదేహన్ని భుజాన వేసుకుని నడిచి వెళ్లుతున్న సాములు గురించి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. విజయనగరం రూరల్ సీఐ తిరుపతి రావు, గంట్యాడ ఎస్ఐ కిరణ్ కుమార్ అతడిని ఆపి వివరాలు తెలుసుకున్నారు.
ఎటుపోవాలో తెలియ అప్పటికే నాలుగు కిలోమీటర్ల మేర వెనక్కి నడిచినట్లు గుర్తించిన వారు.. అతని బంధువులతో ఫోన్లో మాట్లాడారు. సాములకు భోజనం పెట్టించి, ఒడిశాలోని సుంకి వరకు అంబులెన్స్ లో వెళ్ళేలా ఏర్పాట్లు చేశారు.
మానవత్వం ప్రశ్నార్థకమవుతున్న ప్రస్తుత రోజుల్లో.. భార్యను కోల్పోయి బాధలో ఉన్న నిరుపేద వ్యక్తికి సాయం చేసిన ఏపీ విజయనగరం పోలీసులను స్థానికులు అభినందించారు.