ఉక్రెయిన్ ని ఆక్రమించుకునే లక్ష్యంతో రష్యా జరుపుతున్న దాడులు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రపంచ దేశాలన్నీ యుద్ధం వద్దని ముక్తకంఠంతో కోరుతున్నా.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మాత్రం చెవిన పేను పారినట్టు కూడా లేదు. యుద్ధాన్ని ఆపేయాలంటూ సాక్షాత్తు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. డోంట్ కేర్ అన్నట్టు పుతిన్ వ్యవహరిస్తున్నాడు. మరోవైపు రష్యా చేస్తున్న భీకర దాడిలో సామాన్యులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.
తాజాగా రష్యా బాంబు దాడుల్లో ఉక్రెయిన్ లో ‘మదర్ హీరోయిన్’గా పేరుగాంచిన ఓల్గా సెమిడ్యానోవా (48) ప్రాణాలు కోల్పోయారు. వైద్యురాలు అయిన ఆమె 2014 నుంచి మిలిటరీలో సేవలు అందిస్తున్నారు. ఆమెకు ఆరుగురు సంతానం కాగా.. స్థానిక అనాథ శరణాలయం నుంచి మరో ఆరుగురిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు.
దీంతో ఆమె ‘మదర్ హీరోయిన్’ అనే గౌరవ బిరుదును సొంతం చేసుకున్నారు. ఉక్రెయిన్ లో ఐదుగురు పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి మదర్ హీరోయిన్ అనే బిరుదును ఇస్తారు. డొనెట్స్క్ సమీపంలో రష్యా సేనలతో చివరి వరకు పోరాడి ఆమె వీరమరణం పొందారు. తమ యూనిట్ లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ.. ధైర్యం కోల్పోని ఆమె చివరి శ్వాస వరకు పోరాడి చివరికి తుది శ్వాస విడిచారు.
రాష్యా చేస్తున్న దాడిలో ఆమెకు బుల్లెట్ గాయాలై చనిపోయినట్టు ‘కీవ్ ఇండిపెండెంట్’ తెలిపింది. అయితే.. అక్కడ ఇంకా భీకర పోరు జరుగుతుండటంతో మృతదేహాన్ని ఇంకా స్వాధీనం చేసుకోలేకపోయినట్టు తెలుస్తోంది. ఆమె మరణ వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.
రష్యా సైనికులు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై చేసిన రాకెట్ బాంబుల దాడిలో ఉక్రెయిన్ నటి ఒక్సానా ష్వెట్స్ మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. కాగా.. ఒక్సానా ‘ది సీక్రెట్ ఆఫ్ సెయింట్ పాట్రిక్, టుమారో విల్ బీ టుమారో చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాధించుకుంది. అంతేగాకుండా ఉక్రెయిన్ లోని ప్రతిష్టాత్మక మెరిటెడ్ ఆర్టిస్ట్ అవార్డ్ ను కూడా గెలుచుకున్నారు ఒక్సానా.