కరోనాతో ప్రజలంతా సతమతం అవుతున్నారు. ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ తో లక్షల్లో ప్రజలు మరణించారు. ఇప్పుడు థర్డ్ వేవ్ ఒమిక్రాన్ ఉద్ధృతి తారస్థాయికి చేరుతోంది. అయితే.. వచ్చే నాలుగు వారాల్లో ఒమిక్రాన్ తగ్గుముఖం పడుతుందని ప్రముఖ వైద్య నిపుణుడు, ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డి.నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. దక్షిణాఫ్రికాలో చాలా వేగంగా కేసులు పెరిగి, అంతేవేగంగా తగ్గినట్టు ఆయన గుర్తుచేశారు. భారత్ లో కూడా వచ్చే నాలుగు వారాల్లో కరోనా తీవ్రత తగ్గిపోతుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఒమిక్రాన్ లో ఉపరకం బీఏ2 వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు నాగేశ్వర్ రెడ్డి చెప్పారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలకు ఇది చిక్కడం లేదని అన్నారు. ఇప్పటి వరకు పరీక్షలో ఎస్జీన్ కనిపించకపోతే ఒమిక్రాన్ గా గుర్తించడం సాధ్యపడేదని పేర్కొన్నారు. కానీ.. బీఏ2 రకం అలా కాదన్నారు.
ఎస్జీన్ గుర్తించిన వారిలోనూ ఒమిక్రాన్ వెలుగు చూస్తోందని నాగేశ్వర్ రెడ్డి చెప్పారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందినప్పటికీ..దాని తీవ్రత పెద్దగా ప్రభావం చూపడం లేదని డాక్టర్ చెప్పారు. కొద్ది మందిలో ముఖ్యంగా, దీర్ఘకాలిక వ్యాధి బాధితుల్లో ఒమిక్రాన్ తీవ్రత కనిపిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్న 20 మంది వరకు ఒమిక్రాన్ తో బాధపడుతూ.. తమ ఆస్పత్రిలోని ఐసీయూల్లో చికిత్స తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. పిల్లల్లోనూ దీని ప్రభావం కనిపిస్తోందని వెల్లడించారు. ఒమిక్రాన్ తగ్గిపోయిన తర్వాత నీరసం, బలహీనతతో కొంతమంది ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు. కానీ.. కరోనా థర్డ్ వేవ్ పట్ల నిర్లక్ష్యం పనికిరాదన్నారు డాక్టర్ నాగేశ్వర్ రావు.