అమెరికాలో ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని సీడీసీ డైరెక్టర్ రొషెల్ వాలెన్స్కీ అన్నారు. దేశ వ్యాప్తంగా డెల్టా కేసులు భారీగా పెరుగుతున్నప్పటికీ లాక్డౌన్ పెట్టాల్సిన అవసరం లేదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. ఈ వేరియంట్ ఇప్పటికే 75 దేశాలకు విస్తరించింది. అమెరికాలో 36 రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయని వివరించారు. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ఒమిక్రాన్ కేసులు రెండు రోజులకు ఒకసారి రెట్టింపు అవుతున్నాయని చెప్పారు. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తిపై నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణ వివరాలను సీడీసీ ఇప్పటికే విడుదల చేసిందని తెలిపారు.
డెల్టా ఉద్ధృతి రోజురోజకు తీవ్రంగా మారింది. ఇంకా పెరుగుతోంది. దీనికి తోడు ఒమిక్రాన్ వ్యాప్తి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో విద్యాసంస్థలు మళ్లీ ఆన్లైన్ క్లాసులు పెట్టే యోచనలో ఉన్నాయి. ఫైనల్ ఎగ్జామ్స్ ను ఆన్ లైన్ ద్వారా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చాలా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సైతం ఆన్ లైన్ బాటపడుతున్నాయి.