రెండేళ్లుగా ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారి వివిధ రూపాల్లో విజృంభిస్తోంది. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. చైనా సహా మరికొన్ని దేశాల్లో మరోసారి పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం.. కట్టడి చేసేందుకు లాక్ డౌన్ లాంటి చర్యలకు పూనుకోవడం మళ్లీ కలకలం రేపుతోంది.
ఈ నేపథ్యంలో కోవిడ్ మహమ్మారిపై అమెరికా వైట్ హౌస్ ముఖ్య ఆరోగ్య సలహాదారు ఆంటోనీ ఫౌచీ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆయన కొత్త వేరియంట్ వ్యాప్తిపై సంచలన విషయాలు బయటపెట్టారు. ఒమిక్రాన్ కు చెందిన ఉప వేరియంట్ బీఏ.2 కారణంగా అమెరికాలో మరోసారి కరోనా విజృంభిస్తుందని పేర్కొన్నారు.
పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు ఆంటోనీ. ఒమిక్రాన్ తో పోలిస్తే కొత్త వేరియంట్ బీఏ.2.. 60 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని వ్యాఖ్యానించారు. కాకపోతే దీనివల్ల తీవ్రమైన దుష్పరిణామాలు ఉండవని తెలిపారు.
అమెరికాలో నమోదయ్యే కొత్త కేసుల్లో ఈ ఉప వేరియంట్ రకానికి చెందినవే 30శాతం ఉంటాయని చెప్పారు. అమెరికాలో అత్యంత ప్రభావం చూపే వేరియంట్ గా బీఏ.2 నిలుస్తుందని అంచనా వేశారు ఆంటోనీ.