యాదాద్రి స్వయంభు లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మహా కుంభ సంప్రోక్షణ యాగం అంగరంగ వైభవంగా సాగుతోంది. అందులో భాగంగా 7వ రోజు పంచకుండాత్మక యాగాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం శాంతి పాఠం, చతు:స్థానార్చన, మూలమంత్ర హావనములు, అష్టోత్తర శత కలశాభిషేకం, నిత్యలఘు పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు.
దీంతో పాటు సాయంత్రం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, మూలమంత్ర హావనములు, చతుఃస్థానర్చనలు, షోడ కళాన్యాస హోమములు, పంచశయ్యదివాసం, నిత్య లఘు పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు అర్చకులు తెలిపారు.
అందుకు కావల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రికి సీఎం కేసీఆర్ దంపతులు కుటుంబ సమేతంగా యాదాద్రికి చేరుకోనున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా.. నేటితో బాలాలయంలో భక్తులకు దర్శనాలు ముగియనున్నాయి. ప్రధానాలయం పునఃనిర్మాణం దృష్ట్యా 2016 ఏప్రిల్ 21 నుంచి బాలాలయంలో భక్తులకు దర్శనాలు కల్పించారు నిర్వాహకులు.
సోమవారం ఉదయం 11:55 గంటల స్వామివారి ఆలయంలో మహా కుంభ సంప్రోక్షణ యాగం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి భక్తులకు స్వయంభువు లక్ష్మీ నరసింహస్వామి దర్శనాలు కల్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు రూ.1280 కోట్లతో సీఎం కేసీఆర్ యాదాద్రి పునఃనిర్మాణం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేశారు.