సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకల్లో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుకు నిరసన సెగ తగిలింది. మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి భర్తీని కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి ఎస్సీ రిజర్వ్ కాగా.. ఆ పదవిని భర్తీ చేసేందుకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఎమ్మెల్యేను నిలదీశారు. ఇటీవల స్థానిక గాంధీనగర్ లో బస్తీ దవాఖాన ప్రారంభం సమయంలోనూ ఈ విషయంపై ప్రస్తావిస్తే.. దాటవేశారని గుర్తు చేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని భర్తీ చేయాలంటూ ఆ నేతలు ఎమ్మెల్యేను నిలదీయడం ఇప్పుడు మిర్యాలగూడ పట్టణ రాజకీయావర్గాల్లో చర్చనీయాంశమైంది.
అయితే 2019 లో మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి జనరల్ కు రిజర్వు కాగా.. చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డిని నెల రోజుల్లో నియమించారని గుర్తు చేశారు. కానీ 2022 ఆగష్టులో పాలక వర్గం గడువు పూర్తయినా.. ఇప్పటి వరకు ఎందుకు భర్తీ చేయలేదో వెల్లడించాలని డిమాండ్ చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ నేపథ్యం కలిగిన సీనియర్ నేత ఉబ్బపల్లి సోములు మాదిగకు.. లేదా ఆ ఫ్యామిలీకి వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ పదవిని ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే వారిని సముదాయించి.. త్వరలోనే ఛైర్మన్ పదవిని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.