ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం.. బస్సుకు అధిక మైలేజీ రావాలనే తాపత్రయం.. షార్ట్ కట్లో వెళ్తే ఆదా అవుతుందనే దురాలోచన.. ఇవన్నీ కలిసి 65 మంది మరణాన్ని అడ్డంగా శాసించాయి. కొండగట్టు దారుణం జరిగి సరిగ్గా సంవత్సరం. అప్పుడు ఎన్నికల కోడ్ ప్రొబ్లమ్ అవుతోందని చెప్పి తప్పించుకు తిరిగిన సీయం ఇప్పుడు ఏ కోడ్ వుందని బాధితులకు ఇంతవరకు న్యాయం చేయలేకపోయారు? కుటుంబానికో ఉద్యోగం, పది లక్షల ఆర్థిక సాయం అని ప్రకటించి ఇంతవరకు ఎందుకు ఇవ్వలేకపోయారు?
అప్పుడు ఆ దుస్సంఘటన ఇంకా గుర్తుంది. కొండగట్టు ఘాట్ రోడ్ నుంచి బస్సు దింపుతున్న క్రమంలో అదుపుతప్పి సమీపంలోని లోయలో పడిపోయింది. బస్సులో వున్న 65 మంది మృత్యువాత పడ్డారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమీదం జరిగి సంవత్సరం అవుతోంది. ఇప్పటికీ బాధిత కుటుంబాలు పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నాయి. ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఘటనా స్థలానికి రానేలేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించినే లేదు. సంవత్సర కాలంగా మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పట్టించుకున్న దాఖలాలే లేవు. ఇప్పుడా కుటుంబాలు, ఆ క్షతగాత్రులు ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో తెలుసుకునే ప్రయత్నం అధికార పార్టీ నేతలు ఎవరు కూడా చేయలేదు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని హిమ్మత్నగర్, తిమ్మయ్యపల్లి, తిరుమలాపూర్ మొదలగు గ్రామాలకు చెందిన ప్రజలు సమీపంలోని జగిత్యాల జిల్లా కేంద్రంలోకి బయల్దేరారు. ప్రతిరోజు జె.ఎన్.టి.యు నుంచి కరీంనగర్ జగిత్యాల హైవే రోడ్లో జగిత్యాలకి వెళ్తారు. అయితే జగిత్యాల బస్ డిపో మేనేజర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కొండగట్టు ఘాట్ రోడ్డు నుంచి కిందికి వస్తుండగా లోయలో పడింది. అప్పటికే స్పాట్లో 40 మందికి పైగా ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మరికొంత మంది చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. మృతుల కుటుంబాలకు ఇన్సూరెన్సు, ఆర్టిసీ ఇతరత్రా సహాయ కార్యక్రమాలు పది లక్షల వరకు అందాయి. క్షతగాత్రులకు మూడు లక్షల వరకు అందాయి. ఐతే ఏంటి.. అమూల్యమైన ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. దహన సంస్కారాలు చేయడానికి తమ వాళ్లెవరూ దగ్గర్లో లేరు. విదేశాల్లో వున్నవాళ్లు వచ్చేవరకు బాడీలను ఉంచలేని పరిస్థితి. వాటిని భద్రపరచడానికి ఫ్రీజర్లు కూడా అందుబాటులో లేక చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి అప్పుడు. ఈ క్రమంలో మీడియా, ప్రతి పక్షాలు, ఇతర అధికారులు, మినిస్టర్లు ఆ రెండు మూడు రోజులు హడావుడి చేశారు. తర్వాత అంతా మామూలే. ఇప్పటికి ఘటన జరిగి సంవత్సరం అవుతుంది. చాలా మంది బాధితులు అలానే ఉన్నారు. తల్లికి జ్వరం వచ్చింది. జగిత్యాల ఆసుపత్రిలో వైద్యుల కోసం అని బయలుదేరిన కూతురు ఆ ప్రమాదంలో మృత్యువాత పడింది. ముఖ్యమైన పని మీద వెళ్లాల్సిన ఆడపడుచు కాల్వెరి మంచానికే పరిమితం అయింది. తన కూతురు తొలిసారి గర్భవతి అని తెలిసి వైద్యుల కోసం బయలుదేరిన ఓ కన్నతల్లి కూతుర్ని పోగొట్టుకుంది. తన కాలును కూడా పోగొట్టుకుంది. మరోవైపు తన తల్లిదండ్రులు జగిత్యాలలో వున్నారు, వెళ్లి వస్తాను అని బయల్దేరిన యువకుడు శవంగా మారాడు. పుట్టెడు దుఃఖం దిగమింగుకుని అతని తల్లిదండ్రులు బతుకులీడుస్తున్నారు. ఇంకా ఎందరో క్షతగాత్రులు, మృతుల కుటుంబీకులు రోజువారీ జీవనం ఎంతో కష్టం మీద నెట్టుకొస్తున్నారు. భాదలను అనుభవిస్తూనే ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే 10 లక్షల ఆర్థిక సహాయం, ఇంటికో ఉద్యోగం అని చెప్పిన ముఖ్యమంత్రి, ఇప్పటి వరకు ఆ మాట నిలబెట్టుకోలేదు. అప్పుడు ఎన్నికల కోడ్ సాకు చూపించి తప్పించుకున్నారు. ఇప్పుడు ఏ కోడ్ లేదుగా మాట నిలుపుకోరా.. అంటున్నారు బాధితులు.