రవీంద్ర భారతిలో జరిగిన ఉగాది వేడుకల్లో శారదపీఠం పండితులు బ్రహ్మర్షి బాచంపల్లి సంతోష్ కుమార్ శ్రీ శోభకృత నామ సంవత్సర పంచాంగ శ్రవణం పటించారు. ఇందులో పలు రాజకీయ అంశాలు ఆసక్తికరంగా మారాయి. అధికార పక్షాన్ని అలర్ట్ చేస్తూ.. కొంత మంది వ్యక్తుల నుంచి వ్యతిరేకతలు వస్తాయని.. పాలించే రాజు జాగ్రత్తగా ఉండాలని సూచించడం జరిగింది.
ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని..పెండింగ్ బిల్లులన్నింటికి క్లియరెన్స్ ఈ ఏడాది రాబోతోందన్నారు. ఇక నాగార్జున సాగర్, శ్రీశైలం, కాళేశ్వరం ప్రాజెక్టలన్నీ ఈ ఏడాది నిండబోతున్నాయన్నారు. విద్యార్థులకు మంచి అవకాశాలు రాబోతున్నాయని, అయితే విద్యాశాఖలో కొన్ని అవకతవకలు జరిగే అవకాశముందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సమూల మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.
న్యాయ వ్యవస్థ ఈ ఏడాది మంచి తీర్పులు ఇవ్వబోతోందని.. అవి రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయని పండితులు సంతోష్ కుమార్ అన్నారు.ఇక కొన్ని మత ఘర్షణలు, సామాజిక ఉద్రిక్తతలు జరిగే అవకాశం ఉందని.. ఉత్తర భారతంలో భారీ అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతాయన్నారు.
ఈ మూడు మాసాల్లో విపరీతమైన ఒడిదుడుకులు జరగబోతున్నాయన్నారు. తెలంగాణ ప్రజలు ఆసక్తికరమైన రాజకీయాలను చూడబోతున్నారని.. ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకోవాలని సూచించారు.ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యం లో జరిగిన ఈ ఉగాది వేడుకల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.