సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా త్వరలోనే ఆఫ్ లైన్ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రకియ ప్రారంభిస్తామని టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ కారణంగా, ఉద్యోగులు, భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని.. విధిలేని పరిస్థితిలో ఆన్ లైన్ ద్వారా సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
కొవిడ్ వ్యాప్తి చెందుతుందన్న నేపథ్యంలో తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా టోకెన్లు జారీ విధానాన్ని గత ఏడాది సెప్టెంబరు 25 వ తేదీ నుంచి రద్దు చేశామని ఛైర్మన్ తెలిపారు. ఆన్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నప్పటికీ.. అవి గ్రామీణ ప్రాంతంలో ఉన్న సామాన్య భక్తులకు అందడం లేదన్న భావనలో టీటీడీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.
సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా తిరుపతిలో ఆఫ్ లైన్ విధానంలో సర్వదర్శన టోకెన్లు జారీ చేయాలని అనేక సార్లు భావించినప్పటికీ.. కోవిడ్ తీవ్రత కారణంగా వాయిదా వేయక తప్పలేదని సుబ్బారెడ్డి చెప్పారు. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. వారి సూచనల మేరకు ప్రస్తుతం ఆన్ లైన్ లో ఫిబ్రవరి 15వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్లు మాత్రమే జారీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఫిబ్రవరి 15వ తేదీ కోవిడ్ వ్యాప్తి పరిస్థితిని అంచనా వేసి సర్వదర్శనం టోకెన్లు సామాన్య భక్తులకు సులభతరంగా అందేలా ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ తెలిపారు. టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైందని అన్నారు. అందుకు భక్తులు సహకరించాలని కోరారు.