పాకిస్తాన్ మంత్రి అబైదుల్లా బాయిగ్ ను రెండు రోజుల క్రితం ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అయితే ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. ఆయన ప్రయాణిస్తున్న దారిని బ్లాక్ చేసి మరీ కిడ్నాప్ చేశారు. ఉగ్రవాదులు ప్రభుత్వంతో చర్చలు జరిపిన అనంతరం ఆయనను విడుదల చేశారు.
పాక్లోని తెహ్రీక్-ఇ-తాలిబన్ మిలిటెంట్ల ఆధీనంలో ఉన్న గిల్గిత్-బల్తిస్తాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇస్లామాబాద్ నుంచి బాబుసర్ వైపు శుక్రవారం రాత్రి వస్తుండగా ఈ ఘటన జరిగింది. జైలులో ఉన్న తమ సహచరులను విడిపించాలన్న డిమాండ్తో కూడిన వీడియో క్లిప్ను ఉగ్రవాదుల చెర నుంచి విడుదలైన మంత్రి చూపించారు.మహిళా క్రీడా కార్యకలాపాలు లేకుండా చట్టాలు రూపొందించాలని కూడా అందులో డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి ఉగ్రవాదులు కొన్ని షరతులు విధించారు. ఆ షరతుల అమలుకు 10 రోజుల గడువు విధించారు. ఆ సమయంలోపు ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే ఒప్పందంతో మంత్రిని విడుదల చేశారు. గడువు దాటితే ప్రభుత్వంపై మరిన్ని చర్యలు ఉంటాయని ఉగ్రవాదులు హెచ్చరించారు.
ప్రభుత్వం ఆధీనంలో కొంత మంది ఉగ్రవాదలు ఉన్నారు. 2013లో జరిగిన నంగా పర్భాత్ ఉదంతానికి కొనసాగింపే ఇదని అంటున్నారు. ఆ సమయంలో కొంత మంది ఉగ్రవాదులు.. పారా మిలిటరీ దుస్తుల్లో వచ్చి ఒక విదేశీ టూరిస్ట్ని కాల్చి చంపారు. నంగా పర్బత్ ప్రాంతంలో విదేశీ పర్యాటకుల హత్యతో ప్రమేయమున్న వారితో పాటు డైమర్లో ఇతర ఉగ్ర ఘటనల్లో పాల్గొన్న తమ సహచరులను విడిచిపెట్టాలని ఉగ్రవాదులు డిమాండ్ చేస్తున్నారు.
మంత్రి ఉగ్రవాదుల చెరలో ఉన్నప్పుడు గిల్గిత్ బల్తిస్తాన్ ప్రభుత్వ మాజీ అధికార ప్రతినిధి ఫైజుల్లా మాట్లాడుతూ.. తాను అబైదుల్లా బేగ్తో మాట్లాడానని, ఆయన విడుదలకు చర్చలు జరుపుతున్నామని అన్నారు. కాగా, అబైదుల్లా బాయిగ్ తన ఇంటికి క్షేమంగా చేరుకున్నట్టు పాకిస్థాన్ అధికారిక టీవీ చానల్ జియో టీవీ పేర్కొంది.