బాహుబలి ది బిగినింగ్ మూవీ అందరూ చూసే ఉంటారు.అందులో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ ఉంటుంది. శివుడు(ప్రభాస్) , తల్లి (రోహిణి) శివాభిషేకం చేస్తూ ఉంటుంది. ఓపిక లేకపోయినా ఒక్కో కడవా మోస్తూ అభిషేకం చేస్తూ ఉంటుంది.
తల్లి కష్టాన్ని చూడలేని శివుడు తన భుజ బలంతో శివలింగాన్ని అమాంతం ఎత్తి సరిగ్గా జలపాతానికి దగ్గరగా సెట్ చేసి తల్లి కష్టపడకుండా అభిషేకం చేసుకునే ఏర్పాటు చేస్తాడు. అలాంటి బుల్లి బాహుబలి మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో వెలుగులోకి వచ్చాడు.
మండుటెండలో తల్లి నీటికోసం పడుతున్న కష్టాన్ని చూడలేక ఏకంగా ఇంటి ఆవరణలోనే బావిని తవ్వేశాడు. భూగర్భం నుంచి ఉబికి వచ్చిన స్వచ్ఛమైన జలాలను చూసి ఆ బాలుడితో పాటు కుటుంబ సభ్యులు మురిసిపోయారు. తల్లి నీటి కష్టాలు తీర్చిన కుమారుడిపై స్థానికులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
పాల్గర్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల కుర్రాడు ప్రణవ్ 9వ తరగతి చదువుతున్నాడు. ప్రణవ్ తల్లిదండ్రులు దర్శన, వినాయక సాల్కర్ రోజు వారీ కూలీలు. అయితే వారు ఉంటున్న దవంగే పడా ఏరియాలో నీటి కష్టాలు ఉన్నాయి.
దీంతో తల్లి దర్శన ప్రతి రోజు సమీపంలో ఉన్న ఓ చెరువు వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చేది. మండుటెండల్లోనూ ఆమె నీళ్ల కోసం పడరాని పాట్లు పడేది. తల్లి కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయిన ప్రణవ్..తనకు సమయం దొరికినప్పుడల్లా..ఇంటి ఆవరణలోనే ఓ బావిని తవ్వాడు.
ఆ తర్వాత భూమిలో నుంచి స్వచ్ఛమైన జలాలు ఉబికి వచ్చాయి. ఇక ఇప్పుడు తల్లి చెరువుకు వెళ్లడం లేదు. బావిలో ఊరుతున్న నీటినే తాగడానికి, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రణవ్ తల్లి దర్శన మాట్లాడుతూ.. తన కుమారుడు బావి తవ్వడంతో ఇప్పుడు నీటి కష్టాలు తీరాయి. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. తన కొడుకును చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని ఆమె సంబంగా చెబుతోంది.
తండ్రి వినాయక్ మాట్లాడుతూ.. ప్రణవ్ బావి తవ్వుతున్న సమయంలో తాను కేవలం అడ్డొచ్చిన రాళ్లను మాత్రమే బయటకు తీశాను. మిగతా పనంతా ప్రణవే చేశాడని తెలిపాడు. బావిలో నీరు చూసినప్పుడు తన కుమారుడి కష్టం గుర్తొస్తుంది. మొత్తానికి సంతోషంగా ఉందన్నాడు.