ప్రగతి భవన్ ను పేల్చేయాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. తాజాగా ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలంతా కలిసి బుధవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. రేవంత్ పై పీడీ యాక్ట్ పెట్టాలని కోరారు.
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ కు విజ్ఞప్తి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మృత్యుశయ్యపై ఉందని విమర్శించారు. సీనియర్లను కాదని ఓ బ్లాక్ మెయిలర్ ను పీసీసీ అధ్యక్షుడుగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
ములుగు జిల్లాలో అభివృద్ధి పనులపై కూడా తప్పుగా మాట్లాడారని మండిపడ్డారు. ములుగులో గిరిజన యూనివర్సిటీపై కూడా రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
వర్సిటీ ఏర్పాటుకు భూమిని సేకరించిన అనంతరం సీఎం కేసీఆర్ దీనిపై ప్రకటన చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వర్సిటీ భూమి, భవనాల వివరాలు ఇస్తామని.. దానిపై కేంద్రాన్ని ప్రశ్నించమని అని రేవంత్ కు సూచించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.