‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ మూవీలతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు దర్శకధీరుడు రాజమౌళి. లేటెస్ట్ గా ‘నాటు నాటు’ సాంగ్ కి ఆస్కార్ రావడంతో హాలీవుడ్ దిగ్గజాలు సైతం జక్కన్నను కొనియాడుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి.. ఆయన నెక్ట్స్ సినిమాపైనే ఉంది. ఇప్పటికే రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో నెక్ట్స్ మూవీ ఉంటుందని అనౌన్స్ చేశారు.
ఇప్పుడు దీనికి సంబంధించి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకూ రాజమౌళి చేసిన సినిమాలన్నీ ఓ ఎత్తు అయితే.. ఆస్కార్ అవార్డ్ వచ్చిన తర్వాత చేస్తున్న SSMB29 మూవీ మరో ఎత్తు. ఇందుకోసం రాజమౌళి భారీ స్కెచ్ లే వేస్తున్నారట.
ఏకంగా ఈసారి హాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ తో పాటు టెక్నీషియన్స్ తో చేతులు కలుపుతున్నారు జక్కన్న. ఇప్పటికే హాలీవుడ్ సంస్థ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సంస్థ ప్రముఖ హాలీవుడ్ నటీనటులను ఈ సినిమాలో నటించడానికి ఒప్పిస్తుంది. దీంతో పాటు ఈ సినిమాలో థోర్ మూవీ యాక్టర్ క్రిస్ హెమ్స్ వర్త్ నటిస్తారనే టాక్ వినిపిస్తోంది.
కాగా ఇప్పుడు ఏకంగా హీరోయిన్గా హాలీవుడ్ భామను రంగంలోకి దించుతున్నారట రాజమౌళి. ఇది తెలిసిన మీడియావర్గాలు జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా అని అనుకుంటున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో పూజా కార్యక్రమాలను చేసి, వచ్చే ఏడాది ప్రథమార్థంలో SSMB 29ను తెరకెక్కించేలా రాజమౌళి ప్లాన్ చేసుకున్నారు.
జేమ్స్ బాండ్, ఇండియానా జోన్స్ తరహా యాక్షన్ మూవీని మహేష్ తో చేయటానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. గ్లోబెల్ రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ గా SSMB 29ను తెరకెక్కించబోతున్నట్లు కొన్ని ఇంటర్వ్యూల్లో తెలియజేశాడు జక్కన్న. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ మూవీ కాబట్టి మినిమమ్ బడ్జెట్టే రూ.500 కోట్లు అని టాక్. మరి మేకింగ్ లో ఇదెంత మేరకు పెరుగుతుందో చూడాలి మరి.