హరిత హారాన్ని ముక్కలు చేసాడు ఓ వ్యక్తి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన హరితాభివృద్ధికి తుంటరి తనంతో తూట్లుపొడిచాడు. సూర్యాపేట జిల్లాలో ఈ ఘటన జరిగింది. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను నరికిన ఆ వ్యక్తికి పంచాయితీ అధికారులు జరిమానా విధించారు. అయినప్పటికీ పర్యావరణానికి మేలు చేసే చెట్లను నరికెయ్యడం సమాజానికి చేటు చేసినట్టే లెక్కని పలువురు స్పందిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట, ఖమ్మం రహదారి వెంట SRSP కాలువ పక్కనే దాదాపు 150 చెట్లు ఉన్నాయి. అయితే చివ్వెల మండలం సూర్యనాయక్ తండాకు చెందిన భూక్యా బాపు ఆ చెట్లను నరికేశాడు. మార్చి 20న ఈ ఘటన జరిగింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న పంచాయితీ అధికారులు భూక్యా బాపుకు ఆరు లక్షల 64 వేల రూపాయలను జరిమానా విధించారు.
ఒక్కో చెట్టుకు 5 వేల చొప్పున జరిమానా విధించినట్టుగా అధికారులు వెల్లడించారు. వారంలోపు జరిమానా కట్టాలని లేనిచో కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.