కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా దేశ వ్యాప్తంగా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పలు దేశాల్లో వ్యాప్తి చెందుతోంది. ఈ వేరియంట్ భారత్ లో కూడా దాని ప్రభావాన్ని చూపుతోంది. భారత్ లోని పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.
అయితే తాజా నివేదిక ప్రకారం కరోనా వైరస్ పిల్లలపై కూడా దాని ప్రభావం చూపుతోంది. చిన్నారుల్లో కడుపునొప్పి, జ్వరం, వాంతులు, విరేచనాలు లాంటివి ఉంటే కచ్చితంగా కరోనా పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగినప్పుడు తప్పని సరిగా మాస్క్ ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా చిన్నారులపై ప్రభావం చూపనుందని అధికారులు పేర్కొన్నారు.
అయితే.. కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న చిన్నారులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఐదుగురు చిన్నారులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇద్దరికి ఆక్సిజన్ చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో పిల్లలకు కోవిడ్ జాగ్రత్తలపై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని వైద్యులు పేర్కొన్నారు.