సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు,దోషికి సరైన శిక్ష పడే వరకు జనసేన అండగా ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జరిగిన దారుణం తనను ఎంతగానో కలచివేసిందన్నారు. సాయంత్రం సింగరేణి కాలనీకి వెళ్లిన పవన్, ఆ బిడ్డ తల్లిదండ్రులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు.”చిన్నారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. సభ్య సమాజం మాట్లాడుకోలేని ఘోరమైన సంఘటన ఇది.ఒక ఇంటి మీద అనుమానం ఉంది చూడమంటే పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోలేకపోయారు.ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పెద్దలకు నా విన్నపం..మంత్రి వర్గంలోని పెద్దలను పంపి బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు భరోసా కల్పించండి” అని కోరారు.
ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన బిడ్డ.. కనబడకుండాపోవడంతో ఆ తల్లిదండ్రులకు ఏమయ్యిందో అర్థంకాలేదని చెప్పారు. వినాయక విగ్రహాల వెంట వెళ్లిందేమోనని సరూర్ నగర్ ట్యాంక్ బండ్ నుంచి అన్ని ప్రాంతాల్లో వెతికారని తెలిపారు. పోలీసులు సకాలంలో స్పందించాల్సి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు నిందితుడు దొరకలేదని, తమకు న్యాయం జరగలేదని చిన్నారి తల్లిదండ్రులు బాధపడుతున్నారని చెప్పారు..పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చనిపోయిన బిడ్డకు న్యాయం జరగాలని కోరుకోవాలన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితులకు ఓదార్పు అవసరమని. ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయగలమో ఆలోచించి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇలాంటి సంఘటనలు పదే పదే పునరావృతం కావడం సమాజానికి అంత మంచిది కాదన్నారు పవన్. మీడియా కొన్ని సంఘటనలపై ఎక్కువగా ప్రచారం చేసి ఇలాంటి వాటిపై స్పందించకపోవడం సరికాదని హితవు పలికారు. ఏదో ఒక సంఘటనను పట్టుకుని హైలెట్ చేసి వదిలేయకుండా.. అన్యాయం జరిగినప్పుడు దాన్ని ఎక్కువ మందికి తెలియచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.