వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. హైదరాబాద్ లోని బాబు నివాసంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా ఇద్దరు చర్చించుకున్నారు. ఆ తర్వాత ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించారు. ముందుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. పెన్షన్లు తీసేయడం, రైతులు, ప్రజల సమస్యలపై చర్చించామని తెలిపారు.
బ్రిటీష్ కాలం నాటి జీవోతో ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. వైజాగ్ లో తనను అడ్డుకున్నారని.. కుప్పంలో చంద్రబాబును కూడా అలాగే అడ్డుకున్నారని అన్నారు. ప్రభుత్వం ఇలా వ్యవహరించడం దుర్మార్గమన్న పవన్.. జీవో నెంబర్ 1 పై ఎలా పోరాడాలనే అంశంపై చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపారు.
ఇక చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. ఇప్పటంలో పవన్ ను అడ్డుకున్నారని.. ఆంక్షలతో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారన్నారు. అలాతే తాను ఎక్కడికి పోయినా అడ్డుపడుతున్నారని ఫైరయ్యారు. గంజాయి, మాదకద్రవ్యాలపై పోరాడితే తమ ఆఫీస్ పై దాడి చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయని విమర్శించారు.
ఏపీలో ప్రజా జీవితం అంధకారంగా మారిపోయిందన్నారు చంద్రబాబు. ప్రతిపక్షాలపై ఆంక్షలు పెట్టి హింసిస్తున్నారని.. పవన్ సభ పెట్టారని ఇప్పటంలో ఇళ్లు కూల్చేశారని ఆరోపించారు. రోడ్లు వెడల్పు పేరుతో ఇళ్లను కూల్చేశారని.. నల్ల జీవో తెచ్చి ఉన్మాదుల్లా వ్యవహరిస్తారా? అని మండిపడ్డారు. తన నియోజకవర్గంలో సైతం అడ్డుకుంటున్నారని ఫైరయ్యారు.
ప్రస్తుతానికి జీవో నెంబర్ 1పై చర్చించామని.. ఎన్నికలు, పొత్తులపై తర్వాత మాట్లాడుకుంటామన్నారు చంద్రబాబు. అన్ని పార్టీలు, సంఘాలు కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో చాలా పొత్తులు పెట్టుకుంటామని.. 2009లో టీఆర్ఎస్ తో కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. ముందు పొత్తు పెట్టుకున్నా ఆ తర్వాత విభేదించామని వివరించారు. రాజకీయాల్లో సమీకరణాలు మారుతుంటాయని తెలిపారు చంద్రబాబు.