రాజధాని పై జగన్ చేసిన ప్రకటన ఓకే వ్యూహం ప్రకారమే చేశారని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్రలో భూములన్నీ చాలా వరకు వైసీపీ నేతల చేతుల్లో ఉన్నాయని, నేను పోరాటయాత్ర చేస్తున్న సమయంలో స్థానికులు చెప్పారన్నారు పవన్.
విశాఖ ప్రాంతంలో భూములను ముందుగానే జగన్ అండ్ టీం హస్తగతం చేసుకున్నారని, అందుకే విశాఖ భూముల విషయంలో కఠినంగా ఉన్న జాయింట్ కలెక్టర్ శివశంకర్ ను ఆఘమేఘాలపై తప్పించి అక్కడే కింద పోస్టుకు మార్చి అవమానించారని విమర్శించారు. ఆ పోస్టులో తమకు అనుకూలమైన వేణుగోపాల్ రెడ్డిని నియమించుకున్నారని, ఈ హడావిడి బదిలీ మొత్తం వారం రోజుల కిందటే జరిగిందని సంచలన ఆరోపణ చేశారు జనసేనాని.
జగన్ రాజధాని పై చేసిన వ్యాఖ్యలు సీజన్లో కొల్లేరు కొంగలు వచ్చినట్లుగా సంవత్సరానికి మూడు సార్లు ఎమ్మెల్యేలు లెజిస్లేటివ్ రాజధానికి వాలి వెళ్లాలన్నమాట. మూడు సీజన్లలో అమరావతికి వచ్చి సభ నడిపి ఆ తర్వాత తాళాలు వేసేయాలనేది జగన్ రెడ్డి ఆలోచనగా ఉందంటూ సెటైర్స్ వేశారు.
వేలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇప్పుడిప్పుడే రాజధాని ప్రాంతానికి అలవాటు పడుతున్నారు. వారి పిల్లలు కూడా రాజధాని ప్రాంతంలో విద్యాలయాల్లో చేరారు. వాళ్లని మళ్ళీ ఎగ్జిక్యూటీవ్ రాజధాని అని మరోచోటికి వెళ్లిపోమంటే ఎలా అని పవన్ ప్రశ్నించారు.
రాజధాని మార్పు అంటే ఆఫీసు ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చడం కాదు.. కొన్ని వేల జీవితాలను బలవంతంగా తరలించటమన్నారు పవన్ కళ్యాణ్.