భారతీయ చలన చిత్ర ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చిత్రానికి సంగీత దర్శకులు ఎమ్ఎమ్ కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ గార్లకి నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
అవార్డు వచ్చిందనే వార్తను చూడగానే ఎంతో సంతోషించాను. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నిలిచిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు గీతంలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసి హుషారెత్తించిందని ఆయన పేర్కొన్నారు. ఆ హుషారు ఈ రోజు ఆస్కార్ వేదిక మీద రెట్టించిన ఉత్సాహంతో కనిపించిందన్నారు.
ఈ వేదికపై ఈ గీతాన్ని ప్రదర్శించడంతోపాటు… అవార్డు పొందటం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరో స్థాయికి చేరిందని తెలిపారు.
ఇంతటి ఘనత పొందేలా ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రాన్ని రూపొందించిన దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి గారికి ప్రత్యేక అభినందనలు . ఆ చిత్రంలో కథానాయక పాత్రల్లో ఒదిగిపోయిన ఎన్.టి.ఆర్., రాంచరణ్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నృత్య దర్శకులు ప్రేమ్ రక్షిత్, చిత్ర నిర్మాత డి.వి.వి.దానయ్యలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రానికి దక్కిన ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుతోపాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు భారతీయ దర్శకులు, నటులు, రచయితలకు స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు.