ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం చోటుచేసుకున్న పరిణామాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు లేకుండా ఈ దాడులేమిటని ప్రశ్నించారు. చట్టసభల గౌరవాన్ని హుందాతనాన్ని పరిరక్షించాలని అన్నారు. చట్ట సభలలో అర్ధవంతమైన చర్చలు చేసి ప్రజలకు మేలు చేస్తారని అందరం ఆశిస్తామని పేర్కొన్నారు.
చట్ట సభల గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత సభా నాయకుడిగా ముఖ్యమంత్రిపైనా, సభ ప్రిసైడింగ్ ఆఫీషియల్స్ మీద ఉందని పవన్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభకు సంబంధించి మీడియా ద్వారా అందిన సమాచారం చూస్తే.. ఈ పరిణామాలు దురదృష్టకరమైనవి. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేవి.
ప్రజల గొంతు నొక్కే జీవో నెం.1పై చర్చను కోరిన ప్రతిపక్ష టీడీపీ శాసన సభ్యులపై అధికార పక్షం దాడి చేయడాన్ని ఖండిస్తున్నాను. ఎమ్మెల్యేలు డీబీవీ స్వామి, జీ బుచ్చయ్య చౌదరిలపై దాడిని ప్రజాస్వామ్యవాదులు ముక్త కంఠంతో ఆక్షేపించాలి. చట్ట సభలలో అర్ధవంతమైన చర్చలు చేసి ప్రజలకు మేలు చేస్తారని అందరం ఆశిస్తాం.
పరిపాలన విధానాల్లో ప్రజా ప్రయోజనాలకి విరుద్ధంగా ఉన్నవాటిపై చర్చ చేయాలి. చర్చ కోసం పట్టుబడితే దాడి చేయడం భావ్యం కాదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ విధమైన దాడులు చట్ట సభల నుంచి వీధుల్లోకి వస్తాయి. ఇటువంటి పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయి. ముందుగా చట్ట సభల గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత సభా నాయకుడిగా ముఖ్యమంత్రిపైనా, సభ ప్రిసైడింగ్ ఆఫీషియల్స్ మీదా ఉంది’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.