తెలంగాణ వారసత్వ సంపద కాలగర్భంలో కలుస్తోందని ఆరోపించారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ‘హాథ్ సే హాథ్’ జోడో యాత్ర రెండో రోజు ములుగు జిల్లాలో కొనసాగుతుంది. సోమవారం రాత్రి పాలంపేటలో బస చేసిన రేవంత్ రెడ్డి.. ఉదయం రామప్ప ఆలయాన్ని సందర్శించారు. రామలింగేశ్వర ఆలయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రేవంత్ రెడ్డి. అనంతరం పార్టీ నేతలతో కలిసి ఆయన రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్కకు తీర్థ, ప్రసాదాలు ఇచ్చి శాలువాలతో సన్మానించారు.
ఆ తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు పొందినా.. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ వారసత్వ సంపదను కేసీఆర్ కనుమరుగు చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పురావస్తుశాఖ నామమాత్రంగా మారి.. అత్యంత విలువైన కళా సంపదను కాపాడే ప్రయత్నం చేయట్లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రామప్పను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
మార్పు కోసం హాథ్ సే హాథ్ జోడో యాత్ర మొదలు పెట్టానన్నారు. ప్రజల ఆకాంక్షలను తెలుసుకొని మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. రామప్పను యునెస్కో గుర్తించినా.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. తెలంగాణ వారసత్వ సంపద కాలగర్భంలో కలపాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ వాస్తు పిచ్చికి కళాఖండాలు నాశనం అవుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. ప్రత్యేక నిధులు కేటాయించి రామప్పను అభివృద్ధి చేస్తామన్నారు.
కేసీఆర్ ప్రజల ఆకాంక్షలను కాలరాసి రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సమూల మార్పు రావాలంటే కేసీఆర్ ను గద్దెదించాలని.. అందుకే ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించేందుకే పాదయాత్ర చేపట్టామని వివరించారు. రాష్ట్రంలో సమస్యల తీవ్రతను పట్టించుకోకుండా ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. మరోవైపు సమస్యలను పక్కనపెట్టి మోడీ ఎన్నికల ప్రణాళికలో మునిగితేలుతున్నారని విమర్శించారు. దేశ ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైనా పట్టించుకోవడంలేదన్నారు రేవంత్ రెడ్డి.