తెలంగాణా పెద్దపల్లి జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకానికి ఓ మహిళ నరకం అనుభవిస్తోంది. తొమ్మిది నెలలు బిడ్డను మోస్తే గత ఆరేళ్ళుగా కత్తెర మోయాల్సి వచ్చింది. పాపం వైద్యుల నిర్లక్ష్యానికి ఆ మహిళ ప్రతిరోజు ప్రశవ వేదనను చవిచూసింది.
2017వ సంవత్సరం ఏప్రిల్ నెలలో మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ మహిళ ప్రసవం కోసం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆమెకు సిజేరియన్ చేసిన వైద్యులు పొట్టలో కత్తెరను మరిచిపోయారు. దీంతో గత ఆరేళ్లుగా ఆమె కడుపు నొప్పితో బాధపడుతోంది.
సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ బాధ ఎక్కువ కావడంతో..భరించలేని స్థితిలో తన కడుపు నొప్పికి గల కారణం ఏంటో తెలుసుకొందామని పెద్ద ఆసుపత్రిలో చేరింది. ప్రసవానికి వచ్చినప్పుడు వైద్యులు పొట్టలో కత్తెరను మరిచిపోయి కుట్లు వేయడంతో ఆ మహిళ ఇప్పుడు నరకయాతన అనుభవిస్తోంది. ఇప్పుడిది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
మూడు రోజుల క్రితం హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో ఆమెకు స్కానింగ్ చేయగా.. పొట్టలో కత్తెర ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆ మహిళతో పాటు కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఆమెకు శస్త్రచికిత్స చేసిన ఆసుపత్రి వైద్యులను నిలదీశారు.
దీంతో వారు ఏం చేయాలో తెలియక సమాచారం బయటకు వెళ్లకుండా పొట్టలోని కత్తెరను తీసేందుకు ఆసుపత్రి యాజమాన్యం అంగీకరించింది. స్కానింగ్కు సంబంధించిన ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కాగా ఆ జిల్లాలో ఇది హాట్ టాపిక్గా మారింది.