300 కోట్ల భూమిని కబ్జా చేసేందుకు పేర్ని నాని ప్లాన్ వేశారని, వైసీపీ ఆఫీసు పేరుతో ప్రభుత్వ భూమిని దోచుకునే కుట్ర చేస్తున్నారని కొల్లు రవీంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రభుత్వ భూమిని వైఎస్సార్ సీపీ కార్యాలయానికి కేటాయించడంపై వివాదం ముదురుతోంది.
సోమవారం నాడు టీడీపీ సీనియర్ నేత , మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. పార్టీ నేతలతో కలిసి నిరసనకు దిగడం, స్థల పరిశీలనకు వెళుతుండగా పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు మీడియాతో కొల్లు రవీంద్ర మాట్లాడారు. వైసీపీ కార్యాలయం పేరుతో 5.40 ఎకరాల ప్రభుత్వ భూమిని దోపిడీ చేసేందుకు కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.
‘300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు పేర్ని నాని ప్లాన్ చేస్తున్నారు. ఎవడబ్బ సొమ్మని ప్రజల ఆస్తిని పార్టీ ఆఫీస్ కు ఇస్తారని.. అది పేర్ని నాని కష్టమా..ఆయన తండ్రి కష్టమా..’ చెప్పాలని డిమాండ్ చేశారు. భూరికార్డులను మార్చిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకుంటారని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. రిటైర్ అయినా చర్యలు తప్పవన్నారు. ప్రజల ఆస్తుల రక్షణ కోసం తాము పోరాడుతామని స్పష్టం చేశారు.
‘ఆ భూమి ఏపీ పోలీసుల క్వార్టర్స్ దని మాస్టర్ ప్లాన్ లో ఉందని, ఆ భూమి పోతున్నా కాపాడుకోలేరా.. ‘అని ప్రశ్నించారు. విలువైన భూమి కొట్టేస్తుంటే.. అధికారులు లంచాల కోసం సహకరిస్తున్నారా.. అంటూ మండిపడ్డారు. పోలీసుల ఆస్తి కోసం తాము పోరాటం చేస్తుంటే.. తిరిగి తమపైనే కేసులు పెడతారా.. అని ప్రశ్నించారు.