స్పౌజ్ బదిలీలను తక్షణమే చేపట్టాలని మినిస్టర్ క్వార్టర్స్ లో స్పౌజ్ టీచర్లు మంత్రులను కలిశారు. మంత్రులు గుంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం స్పౌజ్ బదిలీలను చేపట్టకపోవడం వల్ల టీచర్లుగా తీవ్ర మానసిక వేదనకు గురి అవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
జీవో 317 లో భాగంగా తమను కేటాయించారని… దీంతో నిత్యం వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోందన్నారు. ఎక్కువ దూరం ప్రయాణం చేసి వెళ్లాల్సి రావడంతో ఇంట్లో కుటుంబ సభ్యులు, పిల్లలను కూడా చూసుకోలేని దయనీయ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు వాళ్లు.
అలాగే.. భార్యభర్తలు ఇద్దరూ ఒకే జిల్లాలో పనిచేసే విధంగా స్పౌజ్ బదిలీలు తక్షణమే చేయాలని టీచర్లు కోరారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 19 జిల్లాల్లో 615 స్పౌజ్ బదిలీలను చేసింది. ఇక మిగిలిన 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలను నిలిపివేయడంతో.. అక్కడ కూడా వెంటనే బదిలీలను చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
తరువాత మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటికి వెళ్లిన టీచర్లు ఆమెను కలిసి తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. అయితే ఇటీవలి కాలంలో స్పౌజ్ బదిలీలకు సంబంధించి టీచర్లు చేసిన నిరసన కార్యక్రమంలో వాళ్ల పిల్లలు కూడా పాల్గొన్నారు.