మనిషి జీవితంలో ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయనే సామెత ముమ్మాటికీ సత్యం. అందుకు నిదర్శనమే ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన ఓ జర్నలిస్ట్ జీవిత కథ. ఇతని కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్ లు తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ప్రజల జీవిత పరిస్థితులు.. వారి జీవితాలు తలకిందులయ్యాయి. మూసా మొహమ్మదీ అనే వ్యక్తి తాలిబాన్ల ప్రభుత్వం రాకముందు టాప్ న్యూస్ ఛానల్ లో యాంకర్, జర్నలిస్టుగా మంచి పేరున్న వ్యక్తి. అతనే.. ఇప్పుడు కుటుంబాన్ని పోషించడానికి బయట తినుబండారాలు అమ్ముకుంటున్నాడు.
ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నేషనల్ రేడియో, టెలివిజన్ డైరెక్టర్ జనరల్ అహ్మదుల్లా వాసిక్ స్పందించారు. తన డిపార్ట్ మెంట్ లో మొహమ్మదీని నియమిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి దేశంలో మానవతా, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా అనేక మంది జర్నలిస్టులు, ముఖ్యంగా మహిళలు ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఆఫ్ఘనిస్తాన్ తలసరి ఆదాయం చివరి నాలుగు నెలల్లో మూడింట ఒక వంతుకు పడిపోయిందని ప్రపంచ బ్యాంక్ ఇటీవల పేర్కొంది.