ఎత్తిపోతల పథకం పైప్లైన్లు నాసిరకం వేయడంతో.. నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక పగిలి నీళ్లన్నీ వృథాగా పోతున్నాయి. ఇలాంటి ఘటనలు నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా మంచిర్యాల జిల్లాలో కూడా ఓ పైపు లైన్ పగిలి నీరంతా వృథాగా పోయింది. అయితే, నీరంతా కోతకు వచ్చి నోటిదాకా రాబోతున్న పంటపొలాల్లోకి చేరడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం పైప్లైన్ గురువారం పగిలిపోయింది. దీంతో వరదను తలపించేలా పెద్దఎత్తున నీటి ప్రవాహం కొనసాగింది. ఈ వరద నీటితో రెబ్బెనపల్లి, చెల్కగూడ గ్రామ శివారులో మరోమారు పంటపొలాలు నీటమునిగాయి. దాదాపు పదిహేను ఎకరాల్లో చేతికి వచ్చిన వరి పంట నీటి పాలైంది. దీంతో అన్నదాతలకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది.
అయితే, ఎత్తిపోతల పథకంలో నాసిరకమైన పైపులు వేయడంతో ప్రతీ సంవత్సరం పైపులు పగిలి పంటలు నష్టపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలా పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట నోటిదాకా రావడం లేదని వాపోతున్నారు.
అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునేవారు లేరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యమైన పైపులు వేసి నష్టపోయిన పంటపొలాలు సర్వే చేసి పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.