హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉనాలో నాలుగో వందే భారత్ ట్రైన్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. గురువారం మోడీ ఉనా రైల్వేస్టేషన్ లో జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. వందే భారత్ రైలు ఉనా–ఢిల్లీ స్టేషన్ల మధ్య నడవనుంది. అయితే ఈ రైలు బుధవారం మినహా అన్ని రోజులు నడుస్తుంది. అంబాలా, చండీగఢ్, ఆనంద్పూర్ సాహిబ్, ఉనా రైల్వే స్టేషన్ లలో ఈ రైలు ఆగుతుంది.
ఉదయం 5.50 గంటలకు ఢిల్లీ నుంచి బయలు దేరి.. ఉదయం 11.05 గంటలకు అంబ్ అందౌరా స్టేషన్ కు చేరుకుంటుంది. మళ్లీ మధ్యాహ్నాం అక్కడ నుంచి బయలు దేరి 6.24 గంటలకు తిరిగి ఢిల్లీకి చేరుకుంటుంది. ఇది కేవలం 52 సెకన్లలో గంటకు 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది దేశంలో నాలుగో వందే భారత్ రైలు. మిగిలిన మూడు ట్రైన్స్ ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ-శ్రీమాతా వైష్ణో దేవి కత్రా, గాంధీ నగర్-ముంబై మధ్య నడుస్తున్నాయి
కాగా ఈ కార్యక్రమంలో హిమాచల్ సీఎం జైరాం ఠాకూర్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్రమంత్రి, హమీపూర్ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు.
ఇక అంతకుముందు సీఎం జై రామ్ ఠాకూర్ ఉనా లోని పెఖుబేలా హెలిప్యాడ్ వద్దకు చేరుకొని ప్రధాన మంత్రి మోడీకి స్వాగతం పలికారు. రాష్ట్రంలోని ఎన్నికలు జరగనున్న రెండు జిల్లాల్లో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన అనంతరం ఉనా, చంబా జిల్లాల్లో జరిగే రెండు బహిరంగ సభల్లో ప్రధాన మోడీ ప్రసంగిస్తారు.