ఐఎస్బీ విద్యార్థులు దేశానికే గర్వకారణమని దేశ ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) 20వ వార్షికోత్సవంలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఐఎస్బీ హైదరాబాద్ మరో మైలురాయి అందుకున్నదని, ఇప్పటివరకు ఇక్కడి నుంచి 50 వేల మంది బయటకు వెళ్లారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
ఐఎస్బీ స్టూడెంట్స్ ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపిన మోడీ.. అనేక స్టార్టప్లు కూడా రూపొందించారని ప్రశంసించారు. జీ 20 దేశాల్లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉందని పేర్కొన్నారు. కొవిడ్ విపత్తు వేళ భారతదేశ సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందన్నారు.
గతేడాది భారత్కు రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయన్నారు. దేశం సాధించిన ఘనతలో ఐఎస్బీ విద్యార్థులు, యువకుల పాత్ర ఉందని తెలిపారు. స్టార్టప్లు, సేవా రంగంలో యువత సత్తా చాటుతున్నారని చెప్పారు. భారత ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో మంచి గిరాకీ ఉందన్నారు.
యూత్ వ్యక్తిగత లక్ష్యాలను దేశ లక్ష్యాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. విద్యార్థులు బయటకు వచ్చాక పాలసీ విధానాలు రూపొందిస్తారని తెలిపిన మోడీ..పాలసీ విధానాలు గదుల్లో, కాగితాలకు మాత్రమే పరిమితం కావద్దన్నారు. పాలసీ విధానాలు క్షేత్రస్థాయిలో అమలైతేనే సార్థకత ఉంటుందని వివరించారు. మూడు దశాబ్దాలుగా రాజకీయ అస్థిరతతో సంస్కరణల అమలు కష్టమైందని తెలిపారు. అనంతరం ఐఎస్బీ 20వ వార్షికోత్సవ చిహ్నాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్ అందించారు.