అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మైసూరులో జరిగిన యోగా వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అక్కడ యోగాసనాలు వేశారు. యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడుతుందని చెప్పారు ప్రధాని.
భారత ప్రత్యేకతను, వైవిధ్యాన్ని యోగా ప్రతిబింభిస్తుందన్నారు. కొన్ని నిమిషాలపాటు చేసే ధ్యానం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుందన్నారు. యోగా దినోత్సవం.. ఆరోగ్యం, సంతోషం, శాంతికి సూచిక అని తెలిపారు. ప్రస్తుతం యోగా ప్రపంచం నలుమూలలా విస్తరించిందని పేర్కొన్నారు.
ప్రపంచాన్ని వణికించిన కరోనా విపత్తు సమయంలోనూ యోగా దినోత్సవాలను నిర్వహించామని తెలిపారు ప్రధాని. సమాజంలో శాంతి నెలకొల్పి సమస్యల పరిష్కారానికి యోగా దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. యోగా మానవుని జీవన విధానానికి మార్గంగా నిలుస్తుందని తెలిపారు.
యోగా అనేది ఒక వ్యక్తికే పరిమితం కాదని.. సకల మానవాళికి ఉపయుక్తమైనదని పేర్కొన్నారు మోడీ. యోగా సందేశాన్ని సకల మానవాళికి చేరవేయాలని మోడీ ఆకాంక్షించారు. కాగా.. యోగాను గుర్తించిన ఐక్యరాజ్యసమితి సహా ప్రపంచ దేశాలకు ధన్యవాదాలు చెప్పారు మోడీ.