ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. మార్చి చివరి వారంలో ఆయన తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటిస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
ఈ నెల 13న ప్రధాని మోడీ రాష్ట్రానికి రావాల్సి ఉండగా పర్యటన వాయిదా పడింది. అంతకు ముందు కూడా జనవరి 19న వందేభారత్ రైలుతో పాటు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ఆయన హైదరాబాద్ కు రావాల్సి వుండగా ఆ పర్యటన కూడా వాయిదా పడింది.
ఇది ఇలా వుంటే రాష్ట్రంలో మోడీ పర్యటనలో భారీగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు ఉంటాయని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. సుమారు రూ.7000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఆయన చేయనున్నట్టు గతంలో కిషన్రెడ్డి వెల్లడించారు.
ఐఐటీ హైదరాబాద్లోని అకడమిక్ భవనాలు, ఫ్యాకల్టీ, స్టాఫ్ భవనాలు, వసతి గృహాలు, టెక్నాలజీ రీసెర్చ్ పార్కు, నాలెడ్జ్ సెంటర్, కన్వెన్షన్ సెంటర్, అతిథిగృహం, లెక్చర్ హాల్ కాంప్లెక్స్, హెల్త్ కేర్ తదితర భవనాలను ఆయన ప్రారంభించనున్నారు. దీంతో పాటు సికింద్రాబాద్-మహబూబ్నగర్ మధ్య 85 కి.మీ మేర డబ్లింగ్ రైల్వే లైన్ను ఆయన ప్రారంభించనున్నారు.